- రాజీవ్ గాంధీ 79 జయంతి కార్యక్రమం..
- నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్, తదితరులు..
- సోమాజీ గూడా రాజీవ్ విగ్రహానికి పూలమాలలు..
- గ్రామ పంచాయితీలను బలోపేతం చేసిన రాజీవ్..
- 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనది..
- మహిళకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు..
- పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు..
- కొనియాడిన కాంగ్రెస్ నాయకులు..
హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీ. హనుమంత రావు, జగ్గారెడ్డి తదితరులు సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకివే తమ నివాళులన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేశారని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, సాంకేతిక విప్లవం కూడా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీయేనని కొనియాడారు. ఆనాడు రాజీవ్ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని, పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబమని రేవంత్ వ్యాఖ్యానించారు.
దేశంలో విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అవలంబిస్తోందని, మణిపూర్ మండిపోతున్నా, ప్రధాని మణిపూర్ కు భరోసా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి బొమ్మా, బొరుసులాంటివని.. వారిద్దరిది ఫెవికాల్ బంధమని అన్నారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే… ఇక్కడ సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు