Sunday, May 12, 2024

పోడు భూములపై సర్వహక్కులు గిరిజనులకే..

తప్పక చదవండి

ఈ రోజు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీష్‌రావు అన్నారు. పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇక నుంచి గిరిజనులే పోడు భూములకు యజమానులని, వారి భూముల జోలికి ఎవరూ రారని పేర్కొన్నారు. గిరిజన రైతుల భూములకు పట్టాలతోపాటు రైతుబంధు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘ఇకపై పోడు భూములపై మీకే సర్వ హక్కులు. మీ పేరుతో ధరణిలో భూమి రికార్డవుతుంది. ఇక ఈ భూముల వైపు అటవీ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. గతంలో పోడు భూముల వివాదాలకు సంబంధించి గిరిజనులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం. ఈ భూములు వారసత్వంగా కూడా సంక్రమించే హక్కు కల్పిస్తాం. అంతేగా పోడు భూములు పొందిన రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. రైతులకు అందే ప్రతి స్కీమ్‌ పోడు భూములకు వర్తిస్తుంది. అకాల వర్షాలతో పంట నష్టపోతే పరిహారం అందుతుంది. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లుగా కూడా గిరిజనులు అవకాశాలు పొందుతారు. గిరిజనులు బ్యాంకుల నుంచి పంట రుణాలు కూడా పొందవచ్చు’ అని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

రాష్ట్రంలోని తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన నాయకుడు కేసీఆర్‌ అని హరీష్‌రావు కొనియాడారు. ఇప్పటివరకు 22 మహిళా గిరిజన వెల్ఫేర్‌ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి గిరిజన తండాకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన బిడ్డలకు నాణ్యమైన వైద్యం అందిచేందుకు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ నిధి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని హరీష్‌రావు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు