- నెక్లెస్రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద కాంగ్రెస్ నేతల నివాళి
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించడంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నెక్లెస్రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ తప్పకుండా వస్తుందని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాయకులు, ఉద్యమకారులకు జైపాల్రెడ్డి చెప్పేవారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోదని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. దివంగత నేత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ రావడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఆకాక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి పేరు మీద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ వచ్చిందంటే జైపాల్ రెడ్డి కృషి ఫలితమే అని పేర్కొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ఉత్తమ లోక్సభ సభ్యుడిగా పేరుపొందారన్నారు. ఆయన లేక పోవడం తెలంగాణ రాష్టాన్రికే కాదు.. యావత్ దేశానికి లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసి పార్లమెంట్లో బిల్లును పాస్ ఘనత ఆయనది అని అన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి స్టూడెంట్ లీడర్ నుంచి అంచలంచలుగా ఎదిగారన్నారు. జనతా పార్టీలో జైపాల్ రెడ్డి కొనసాగించినప్పుడు ఇక్కడ ఆయన చెదురని ముద్ర వేసుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్లో జైపాల్ రెడ్డి చేసిన కృషి యావత్ తెలంగాణ ప్రజలు మరువరన్నారు. కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి మెప్పించి బిల్లు పాస్ చేయించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దశలో నడుస్తుందని కోరుతున్నా మని చెప్పుకొచ్చారు.