Friday, May 10, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదు..

తప్పక చదవండి
  • అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు.
  • మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..

నాకు అసెంబ్లీలో అవకాశం వస్తె ప్రజల సమస్యలు ప్రస్తావించాను. రెసిడెన్షియల్ స్కూల్లో, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఇంటర్మీడియట్ లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ కి నెలకు 72 పీరియడ్ ఫిక్స్ చేశారు. సంవత్సరానికి 6 నెలల జీతాలు కూడా రావడం లేదు. కానీ వారు తినేతిండి, ఇళ్ళరెంట్ ఆరు నెలలు ఉండదు కదా సీఎం గారు. వారికి మినిమం స్కేల్ ఫిక్స్ చేయండి.. నోటిఫికేషన్లలో వెయుటేజ్ ఇవ్వాలని అని అడిగితే.. అసెంబ్లీలో సీఎం కెసిఆర్ లేచి హామీ ఇచ్చారు. కానీ అది అమలు కాలేదు. పైగా ఉన్న ఉద్యోగం తీసేశారు. కక్ష్య సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులు వచ్చే వరకు వీరిని కొనసాగించాలని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. దానిని అమలు చేయమని ఈరోజు వారు ధర్నా చేస్తే.. రాజ్యాంగం అమలు చేయాల్సిన సీఎం.. కోర్టు తీర్పును అమలుచేయమనీ కోరితే.. ఐదు వందల మంది గెస్ట్ లెక్చరర్లని అక్రమంగా అరెస్ట్ చేయించారు. వారిని కలవడానికి ముషీరాబాద్ స్టేషన్ కి వెళ్లి వచ్చా.. వారి గోస వర్ణనాతీతంగా ఉంది. సెలవులు వస్తె జీతాలు రావు అని సెలవులు వద్దు అనుకుంటున్న ఏకైక వ్యక్తులు వీరు. వీరి గోస, వేదన మీకు కనుపడుత లేదా కెసిఆర్. ఇంత కక్ష సాధింపు చర్య ఎందుకు ?
ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. గెస్ట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారిలో ఇంటర్ బోర్డులో 1654 మంది, డిగ్రీ కళాశాలలో 1940 మంది, మోడల్ స్కూల్స్ లో 1250 మంది, KGBV కాలేజీల్లో 1350 మంది,
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లలో 9600 మంది మొత్తంగా 15794 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. 12 నెలల జీతం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాను. చైతన్యం ద్వారా తెలంగాణ వచ్చిన విషయం కెసిఆర్ మర్చిపోయినట్లున్నాడు. ఒక రాజాలాగా, చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడు. 1700 మంది మున్సిపల్ కార్మికులను రాష్ట్రం రాగానే తీసివేశారు. సఫాయి అన్నా నీకు సలాం అన్న అని నినాదంతో ప్రధాని వారి కాళ్ళు కడిగి గౌరవిస్తుంటే… నా ఏలుబడిలో సమ్మెలకు ఆస్కారం లేదు అని తొలగించారు. ఆర్టీసి సమ్మె చేసి 39 మంది చనిపోయిన కనికరించలేదు.
సమ్మె చేస్తే శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కెసిఆర్ గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ప్రేమకు లొంగుతారు తప్ప.. దబాయిస్తే లొంగరు. నీవు చేసే పనులు అన్నీ వారి గుండెల్లో రగులుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీ పతనం ఖాయం. నిన్న కెసిఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కట్టిన డబ్బులు వెనక్కు వచ్చాయి అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.

ప్రాణహిత చేవెళ్ల పేరుతో 16,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్ట్ ను వారే 34 వేల కోట్లు చేశారు. కెసిఆర్ వచ్చాక దాన్ని 84 వేల కోట్లు.. లక్ష కోట్లు చేశారు. కాళేశ్వరం వల్ల ఒరిగింది ఏమీ లేదు. దేవుడు కరుణించి మంచి వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగాయి తప్ప కాళేశ్వరం వల్ల కాదు. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బు మొత్తం తిరిగి వచ్చింది అని కెసీఆర్ చెప్తున్నారు. ఇది పచ్చి అబద్దం. వారి లెక్కల ప్రకారం కాళేశ్వరం కట్టినప్పటి నుండి ఇప్పటివరకు 155 టీఎంసీల నీటిని ఎత్తిపోసారు. 1 టీఎంసీ 10 వేల ఎకరాలు చొప్పున 150 టీఎంసీ ల నీటితో 600 కోట్ల రూపాయల పంట పండి ఉంచవచ్చు. కానీ మొత్తం డబ్బు వాపస్ వచ్చింది అంటే వినడానికి ఎడ్డోల్లామా? అంత అమాయకుల లెక్క కనిపిస్తున్నార ? కాళేశ్వరం వల్ల పండే పంట కంటే పెట్టే ఖర్చు ఎక్కువ అని ఆనాడే చెప్పాం. కరెంటు వాడినా వాడకపోయినా 3500 కోట్లు ఫిక్స్డ్ ఛార్జీలు కట్టాలి. కాళేశ్వరం అప్పు మన మనుమళ్లు కూడా కట్టాలి.. కెసిఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
35 శాతం కౌలు రైతులకు రైతుభందు, రైతుభీమా రావడం లేదు. పండిన పంటకు ఎం.ఎస్.పీ. కంటే ఎక్కువ డబ్బులు వచ్చేలా చూడండి ఈ రైతు బంధు అవసరం లేదు అని రైతులు చెప్తున్నారు. మన సొమ్ము తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలలో పంచిపెడుతున్న కెసిఆర్ ఇక్కడ చనిపోయిన కౌలు రైతుల శవాల మీద ఐదు పైసలు కూడా వెయ్యడం లేదు. గతంలో తార్పాల్, కల్టివేటర్, రోటవీటర్, పవర్ స్ప్రే ఇలా అనేక పనిముట్లను సబ్సిడీలో అందించే వారు. పందిళ్లు, డ్రిప్, గ్రీన్ హౌస్ నిర్మాణానికి సబ్సిడీ ఇచ్చేవారు. కానీ కెసిఆర్ అవన్నీ ఎత్తి వేశారు. ఒక్క లక్ష ఎకరాలు అయినా సబ్సిడీ ఇచ్చి కూరగాయలు పండిస్తున్నార ? రైతులను ఆదుకుంటున్నామని కెసిఆర్ చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు. తెలంగాణ ప్రజలు ఈ మోసపు మాటలు నమ్మరు, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు