తిరుమల : సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ధనవంతులు, వీఐపీలు దర్శనాల గురించి శ్రద్ధ పెడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని అన్నారు. తాను స్వామివారి సేవకులకు సేవకునిగా పనిచేస్తానని, అధికారం కోసం కాదని అన్నారు. ధనవంతుల సేవలో తరించేవాడిని కాదని వెల్లడించారు.
టీటీడీ చైర్మన్గా పదవీ ప్రమాణం అనంతరం గురువారం అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా తనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే అవకాశందక్కిందన్నారు. గతంలో చైర్మన్గా పనిచేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు.
మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు. స్వామివారి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని చెప్పారు. హోదా, అధికారం, తాము ముఖ్యలమనే భావనతో దేవుడి దగ్గరికి వచ్చేవారిని ఆయన క్షణకాలమైనా చూడకపోతే ఉపయోగం లేదన్నారు.
తప్పక చదవండి
-Advertisement-