- సక్సెస్ ఫుల్ గా మాడ్యులర్ నుంచి విడిపోయిన ల్యాండర్..
- ఇక చందమామపై కాలుపోమపడమే మిగిలింది..
- ఈ నెల 23 నాడు కనువిందు చేయనున్న అపూర్వ దృశ్యం..
బెంగళూరు : ఇస్రో చరిత్రలో మరో కీలకఘట్టం చోటు చేసుకుంది. చంద్రుడిపై కాలుమోపేందుకు వ్యోమనౌక సిద్దంగా ఉంది. తనకు నిర్దేశించిన మేరకు అది పయనిస్తోంది. భారత వ్యోమనౌక చంద్రయాన్ – 3 గురువారం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఈ వ్యోమనౌక లోని ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ ’విక్రమ్’ విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.. ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన తరువాత ల్యాండ్ మాడ్యూల్ పంపిన సందేశాన్ని బెంగళూరులోని ఐఎస్టీఆర్ఏసీ కేంద్రం అందుకొంది. ‘థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్‘ అని ల్యాండర్ మెసేజ్ పంపినట్టు ఇస్రో ట్విటర్లో ప్రకటించింది. ఈ పక్రియ పూర్తవడంతో ఇక నుంచి ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లిని సొంతంగా చుట్టేస్తుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు డీ ఆర్బిట్ 1 పక్రియ చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆ తర్వాత 20న మరోసారి డీ ఆర్బిట్ 2 పక్రియ చేపడతారు. ఈ పక్రియలతో ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగేలా నిర్ధేశించారు.. ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన తరువాత అతికీలకమైన పరిణామం చోటు చేసుకోనున్నది. వ్యోమనౌక వేగాన్ని తగ్గించే పక్రియను ఇస్రో చేపట్టనున్నది. చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ అంటే చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.విూ దూరం, అపోలూన్ చంద్రుడి ఉపరితలం నుంచి 100 కివిూ దూరం కక్షలోకి ప్రవేశపెడతారు. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్ నిలుపు వేగం సెకనుకు 2 విూటర్లు, హారిజాంటల్ వేగం సెకనుకు 0.5 విూటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు.
మరో వైపు ప్రొపల్సన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష లోనే కొన్ని నెలలు,సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనుందని ఇస్రో వెల్లడించింది.. ప్రొపల్సన్ మాడ్యూల్ భూమి వాతావరణం స్పెక్టోస్కోప్రిక్ అధ్యయనం చేస్తుందని ఇస్రో వివరించింది. అంటే కాంతి, ఇతర రేడియో ధార్మిక కిరణాలను బయటకు పంపడం, వాటిని లోపలికి తీసుకోవడం గురించి అధ్యయనం చేస్తుంది. గాజుపట్టకం లోపలికి కాంతి వెళ్లడం, మళ్లీ దాని నుంచి బయటకు రావడాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. భూమిపై మేఘాల నుంచి పోలరైజేషన్లో వైవిధ్యాలను కూడా పరిశీలిస్తుందని ఇస్రో తెలిపింది. ప్రజలు నివసించడానికి అనువైన పరిస్థితులు సౌర మండలానికి వెలుపల ఉన్న నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహంలో ఉన్నాయేమో కూడా పరిశీలిస్తుందని ఇస్రో వివరించింది. చంద్రయాన్ 3 ని జులై 14న ఎల్ వీ ఎం 3 ఎం 4 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్షలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా అయిదుసార్లు కక్షను పొడిగించారు. 5 వ భూకక్ష పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1న ’ట్రాన్స్ లూనార్ కక్ష ’ లోకి ప్రవేశ పెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష లోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేశారు. బుధవారమే చంద్రయాన్ 3 చివరి దశ కక్షలోకి ప్రవేశించగా, గురువారం ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. అంతా సజావుగా సాగితే ఈనెల 23 న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.. స్పేస్క్రాప్ట్ నుంచి విక్రమ్ విడిపోయిన నేపథ్యంలో ఇవాళ ఇస్రో తన సోషల్ విూడియా అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ల్యాండర్ విక్రమ్.. చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువకానున్నట్లు వెల్లడించింది.. చంద్రయాన్3 చివరి లూనార్ కక్ష్య తగ్గింపు విజయవంతం అవడంపై ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్
2 ప్రయోగం సమయంలో ఆయన ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. ఆగస్టు 23న చంద్రయాన్3 చంద్రుడి ఉపరితలాన్ని తాకే గొప్ప క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని శివన్ పేర్కొన్నారు. గతంలో ప్రయోగించిన చంద్రయాన్
2 కూడా ఈ పక్రియలన్నీ విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. గతంలో ఎదుర్కొన్న వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. చంద్రయాన్`3 కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు.