Thursday, May 9, 2024

పార్టీయే నా ప్రాణం

తప్పక చదవండి
  • అనారోగ్యం వల్లనే కేబినేట్‌కు దూరం
  • రాజీనామా వార్తలు సరికాదు
  • పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా
  • ప్రధాని పర్యటన తరువాత అధ్యక్ష బాధ్యతలు
  • కేబినెట్‌ విస్తరణ వరకు నేను మంత్రినే
  • మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ : అనారోగ్యం వల్లే కేబినెట్‌ భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని, తనకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకోలేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారంపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం చేసుకుంటూ వెళ్తామని, అధికారిక ప్రకటనలు నమ్మాలని వదంతులను నమ్మకూడదని సూచించారు. కేంద్రమంత్రిగా ఉన్న ఆయన కేబినెట్‌ మీటింగ్‌ కు హాజరుకాకపోవడంతో పదవికి రాజీనామా చేయడం వల్లే గైర్హాజరు అయ్యారని ప్రచారం జరిగింది. అయితే కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ వరకు తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. నేటి సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు వస్తానని తెలిపారు. నగరానికి వచ్చాక రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈరోజు వరకు తాను పార్టీని ఏదీ కావాలని కోరలేదని కిషన్‌ రెడ్డి తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా చేసినట్లు గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సైతం 2 పర్యాయాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించానన్నారు. పార్టీ ఆదేశిస్తే, ఏ పని చేయడాని కైనా తాను సిద్ధమేనని పేర్కొన్నారు. వరంగల్‌ లో ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలం ఫోకస్‌ చేశామన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం తనను నియమించాక తొలిసారి కిషన్‌ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్న ఆయన, అధిష్టానం ఏ నిర్ణయంతీసుకున్నా స్వాగతిస్తా అన్నారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఉంటుందని, ఆ తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ నేపథ్యంలో నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రానున్నారు. రాత్రికి రాష్ట్ర పార్టీ నేతలతో కీలకంగా భేటీ కానున్నారు. జులై 6న ఉదయం వరంగల్‌ కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఎనిమిదో తేదీ వరకు వరంగల్‌ లోనే ఉండి సభ ఏర్పాట్లు, ప్రజా సమీకరణ, నేతలతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి కేంద్రానికి వివరించ నున్నారని తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవిపై కిషన్‌ రెడ్డి ఆసక్తి చూపలేదు. తనకు ఆ పదవి కావాలని పార్టీ అధిష్టానాన్ని సైతం అడగలేదు. కానీ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం రావడం, వీలైతే అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. అదే సమయంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ నాయకత్వంపై పార్టీలోనూ అసమ్మతి రాజుకుంది. కొన్ని సందర్భాలలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ సైతం తన సొంత అభిప్రాయాలను చెప్పేవారు. ఈటల రాజేందర్‌ వర్గీయులు ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఎందుకంటే సీఎం కేసీఆర్‌ లోపాలు చాలా తెలుసున్నారు. కేసీఆర్‌ ఆలోచనల్ని అర్థం చేసుకుని ఎత్తుకు పై ఎత్తులు వేయాలంటే ఈటల సరైనవాడని అనుకున్నారు. బీజేపీ హైకమాండ్‌ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా బాధ్యతలు అప్పగించింది. ఎంపీగా గెలిచాక హోం శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రెండేళ్లు కేబినెట్‌ మంత్రిగా పని చేశానని కిషన్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదని, కోరలేదని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ వస్తున్నానన్నారు. 1980 నుంచి ఒక సైనికుడిలా పనిచేస్తూ వస్తున్నానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో కృషి చేస్తానని, సమిష్టి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తున్నానని, ఈరోజు రాత్రి పార్టీ ముఖ్య నేతలను కలిసి మాట్లాడతానని చెప్పారు. ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటనకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఏర్పాట్లపై పనిచేయాలని కిషన్‌ రెడ్డి అన్నారు. పార్టీ నాయకత్వం మొత్తాన్ని ఈ ఏర్పాట్లలో సహకరించాలని కోరుతున్నానన్నారు. రైల్‌ వ్యాగన్‌ తయారీ కేంద్రంకు ప్రధాని భూమిపూజ చేస్తారని, 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందన్నారు. రైల్వే ఓవర్‌ హాలింగ్‌ యూనిట్‌ అని తొలుత అనుకున్నామని, కానీ ప్రధాని వ్యాగన్‌ యూనిట్‌ పెట్టడానికి ఓకే చెప్పారన్నారు. వరంగల్‌ను రైల్వే తయారీ హబ్‌గా తయారు చేయబోతున్నామన్నారు. తెలంగాణకు ఇంత పెద్ద వర్క్‌ షాప్‌, తయారీ యూనిట్‌ రావడం ఇదే మొదటిసారని అన్నారు. అలాగే మోడీ నూతన జాతీయ రహదారులకు భూమిపూజ చేస్తారని, వరంగల్‌ ఎయిర్‌ స్టిప్ర్‌ ద్వారా నేరుగా హెలికాప్టర్‌లో అక్కడికి వచ్చి, భద్రకాళి దర్శనం చేసుకుంటారన్నారు. రైల్వే యూనిట్‌ను వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తారన్నారు. ఆర్ట్స్‌ కాలేజి గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే జూలై 9న దక్షిణ భారత రాష్టాల్ర బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు