Monday, May 20, 2024

అప్రమత్తంగా వుండండి..

తప్పక చదవండి
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..
  • కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్..
  • ఎగువున భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గోదారి..
  • భద్రాచలంలో అత్యవసర చర్యలు చేపట్టండి..
  • ఎన్.టి.ఆర్.ఎఫ్., హెలీకాఫ్టర్లను సిద్ధం చేయాలి : సీఎం..

భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరుకోవడంతో గోదావరి నది వరవళ్లు తొక్కుతోంది. ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి కళకళలాడుతోంది. ఎగువున అతి భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలో అత్యవసర చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలను అప్రమత్తం చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. వెంటనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలను ప్రజలను తరలించాలని సూచించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ఎఫ్, హెలికాప్టర్లను సిద్దం చేసి ఉంచాలని తెలిపారు. భద్రాచలం వద్ద సహాయకచర్యలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ను వెంటనే అక్కడకు పంపించాలని ఆదేశించారు.

ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎటువంటి పరిస్ధితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలం వద్ద పరిస్థితి, సహాయకచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎస్‌ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య, ఆరోగ్యశాఖ, డిజాస్టర్ మేనేజెమెంట్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గత వరదల సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించగా.. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించాలని డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు