- దేశంలో కర్నాటక తరహా ఫలితాలు
- ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది
- లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు
- కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు
- మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్
శంభాజీనగర్
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆలోచనా ధోరణి ఇదే తరహాలో కొనసాగితే రాబోయే ఎన్నికల్లో మార్పులు చోటుచేసుకుంటాయని బుధవారంనాడు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లోక్సభ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉండగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సైతం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్నాయి. లోక్సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశాలపై పవార్ను మీడియా ప్రశ్నించగా, తమ పార్టీతో పాటు మిత్రపక్షంలోని చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని, అయితే తాను మాత్రం అలా జరుగుతుందని అనుకోవడం లేదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను, లోక్సభ ఎన్నికలతో కలిపి గందరగోళం సృష్టించాలని కేంద్రం అనుకోకపోవచ్చని అన్నారు. లోక్సభ ఎన్నికలపైనే వాళ్లు దృష్టి సారించే అవకాశాలుంటాయని చెప్పారు. రైతులకు ఆర్థిక సాయం విషయంలో తెలంగాణ మోడల్ను మహారాష్ట్రలో తీసుకువచ్చే అంశంపై అడిగినప్పుడు, తెలంగాణ మోడల్ ఏమిటో పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అదీగాక, తెలంగాణ చిన్న రాష్ట్రమని, చిన్న రాష్ట్రంలో ఆర్థిక సాయం చేయవచ్చని, అయితే సేద్యానికి సంబధించి మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితి, ఇటీవల కొన్ని హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడంపై పవార్ను ప్రశ్నించగా, రాష్ట్రంలోని చిన్న చిన్న అంశాలకు మతంరంగు పులుముతున్నారని, శాంతి భద్రతల విషయంలో పాలకులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అధికార పార్టీ, వారి మనుషులు రోడ్లపైకి వచ్చి రెండు వర్గాల మధ్య విభేదాలలణ సృష్టిస్తే అది ఎలాంటి మంచి సంకేతాలు ఇవ్వదని చెప్పారు. ఔరంగాబాద్లో ఏదో ఒక వ్యక్తి పోస్టర్ను కొందరు చూపిస్తే, పుణెలా హింస జరగాల్సిన అవసరం ఏముంది? కానీ అదే జరుగుతోందని ఆయన అన్నారు. ఇటీవల అహ్మద్నగర్లో ఇలాంటివి చూశామని, ఈరోజు కొల్హాపూర్లో చూస్తున్నామని, చిన్న విషయానికి ఫోన్లులో మెసేజ్లు పంపడం, మతం రంగుపూయడం, రోడ్ల మీదకు రావడం మంచిది కాదని, అధికార పార్టీలు ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్రంలో మీకు ఇష్టమైన మంత్రి ఎవరని పవార్ను మీడియా ప్రశ్నించగా, కొందరు తమ పనేదే తాము చేసుకుంటూ వెళ్తారని, వివాదరహితంగా ఉంటారని అన్నారు. నితిన్ గడ్కరిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ఆయన పార్టీ కోణంలోంచి ఆలోచించరని, ఎవరైనా ఒక సమస్యను ఆయన దగ్గరకు తీసుకువెళ్లే, ఆ వ్యక్తి ఎవరనేది కాకుండా ఆ అంశం ప్రాధాన్యత ఏమిటనే దానిపైనే గడ్కరి దృష్టి సారిస్తారని పవార్ ప్రశంసించారు. మహారాష్ట్రలో వ్యవసాయ సంబంధిత సమస్యలపై పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి పండిరచే రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అది జరక్కుంటే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతారని, వారికి ఎన్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ దృక్పథం మాత్రం ఆశావహంగా లేదని పవార్ అన్నారు. కోటా నిర్ణయం జరగలేదని, మరోవైపు చక్కెర ధరలు తగ్గుతున్నాయని, ఈ లెక్కలన్నీ చూసుకుంటే రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరేలా కనిపించడం లేదని అన్నారు.