Friday, May 17, 2024

కాంగ్రెస్‌లోకి తీగల..!

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ
  • పార్టీని వీడుతున్న కీలక నేత కృష్ణారెడ్డి
  • మాణిక్‌ రావు థాక్రే, రేవంత్‌రెడ్డితో భేటీ
  • బీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్న తీగల
    హైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాక్‌లు తగుతున్నాయి. ఇప్పటికే కొంత మంది బాడా నేతలు కారు దిగి ప్రతిపక్ష పార్టీల గడప తొక్కగా.. అదే దారిలో మరికొంత మంది కూడా నడుస్తున్నారు. కాగా.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో బిగ్‌ షాట్‌, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కారు దిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తీగల కృష్ణారెడ్డి కోడలు అనితా రెడ్డి.. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఉండగా.. ఇద్దరు కలిసి హస్తం దోస్తీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు కూడా. ఈ సమావేశంతో.. తీగల ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్‌ నగర మేయర్‌గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ.. 2014లో టీడీపీ తరపునే పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి మీద విజయం సాధించారు. ఆ తర్వాత.. టీఆర్‌ఎస్‌లో చేరిన తీగల.. 2018లో మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత.. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ను వీడి కారు ఎక్కటం.. మంత్రి కావటం మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి.. మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అయ్యారు. కాగా.. సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇద్దరు బలమైన నేతలే కావటం.. ఇద్దరూ కూడా ఒకే పార్టీలో ఉండటంతో.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సిట్టింగులకే టికెట్‌ ఇస్తామన్న సంకేతాలు పార్టీ అధిష్ఠానం ఇవ్వటంతో.. పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఉండపోవచ్చని తీగల భావించినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారటమే మేలని నిర్ణయించుకున్న తీగల అందుకు కాంగ్రెస్‌ అయితేనే కరెక్టని నిశ్చయించుకున్నట్టు సమాచారం. తన కోడలితో కలిసి నేడో రేపో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే.. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి కూడా చేరటంతో.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో చర్చ మొదలైంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు