Saturday, July 27, 2024

మేం వ్యతిరేకం

తప్పక చదవండి
  • దేశ ప్రజలను విభజించేందుకు కేంద్రం కుయుక్తులు
  • యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై కేసీఆర్‌ కీలక నిర్ణయం
  • వ్యతిరేకించాలంటూ సీఎంను కలిసిన అసద్‌
  • ముస్లీం పర్సనల్‌ లా బోర్డుతో కలిసి ప్రగతిభవన్‌కు..
  • గిరిజనులకు సంబంధించి లా కమిషన్‌కు వనవాసీ కల్యాణ్‌ సూచన.. త్వరపడి నివేదిక ఇవ్వవద్దని విజ్ఞప్తి

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యూనిఫాం సివిల్‌ కోడ్‌ (ఉమ్మడి పౌర స్మృతి) బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యతిరేకించారు. దేశంలో అభివృద్ధిని పట్టించుకోకుండా, ప్రజల్లోని వివిధ వర్గాల మధ్య కేంద్ర ప్రభుత్వం చిచ్చు పెడుతూ ఉందని, తాజాగా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో మళ్లీ దేశ ప్రజలను విడగొట్టడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. విభిన్నప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని, అందులో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు అయోమయానికి లోనవుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ ప్రజల అస్థిత్వానికి వారి తర తరాల సాంప్రదాయ సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా మారిన.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని, తద్వారా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరుతూ.. సోమవారం ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్‌ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. సమావేశంలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్‌, మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, బోర్డు కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతూ బిల్లుపై పోరాడుతామని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌ రావులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కాగా, మతాలకు ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగ జమునా తహజీబ్‌ను రక్షించేందుకు ముందుకు రావాలని, తమ అభ్యర్థనను అర్థం చేసుకుని, తక్షణమే స్పందిస్తూ.. ఉమ్మడి పౌర స్మృతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినందుకు దేశ ప్రజలందరి తరఫున, బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌కు ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు