- మరోమారు బీఆర్ఎస్ మొండిపట్టు
- మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
- మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకి
- వరంగల్ టూర్కు మావారెవరూ వెళ్లరు : కేటీఆర్
హైదరాబాద్ : ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరించాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించి, బిఆర్ఎస్తో పోరాటమేనని ప్రకటించారు. ఇప్పుడు అదే రీతిలో బిఆర్ఎస్ కూడా తన ప్రతిస్పందన తెలిపింది. తెలంగాణ వ్యతిరేక ప్రధాని మోడీ అని మంత్రి కేటీఆర్ మరోమారు మండిపడ్డారు. అలాంటి ప్రధాని వస్తే తాము పాల్గొనబోమని ప్రకటించారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించు కున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను ప్రధాని మోదీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణకు మాత్రం 520 కోట్లతో వ్యాగన్ ఫాక్టరీనా. మాకేమైనా భిక్షం వేస్తున్నారా. ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా ఎందుకు వస్తున్నారు. మేము ఎవ్వరం ప్రధాని కార్యక్రమానికి హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నాం. రేపటి ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. మేము ఎవ్వరం హాజరుకామని స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రేపటి మోదీ పర్యటనను తామంతా బహిష్కరిస్తు న్నామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాని మోదీని, బీజేపీని ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. ఎన్డీయే మీటింగ్కు బాబు ఎందుకు వెళతారో చెప్పాలి. మోడీతో దేశానికి ఏం మేలు చేసిండు. రాహుల్ గాంధీని ఓ లీడర్గా దేశంలో ఎవరు గుర్తించలేదు. రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ ప్రెసిడెంటా. బహురూపు వేషాలు వేస్తే ప్రజలు నమ్మరు. రాహుల్ గాంధీ ముత్తాత గురించి కూడా ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం రోజుల్లో సీఎం కేసీఆర్ మేధావులతో సమావేశం నిర్వహిస్తారని.. కామన్ సివిల్ కోడ్ మీద చర్చ జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో గాడ్సే దూరాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఆరోపించారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయన్నారు. ఆ పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని వెల్లడిరచారు. సీఎం కేసీఆర్ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్టాల్ల్రో ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని విమర్శించారు. రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆయన ఏ అర్హతతో తమపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్లో రాహుల్ హోదా ఏంటని నిలదీశారు. కుసుమ జగదీశ్ అకాల మరణం ఎంతో బాధించిందని, సాయిచంద్ మరణం పార్టీకి ఎంతో తీరని లోటన్నారు. ఇద్దరి అకాల మరణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కలత చెందారని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు పార్టీ ప్రజాప్రతినిధుల నెల జీతం అందజేస్తామని చెప్పారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సాయిచంద్ సతీమణి రజనిని నియమిస్తున్నామని వెల్లడించారు.