- యుమునా నది మళ్లీ మహోగ్రరూపం
- ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోన్న యమునా
- రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకల నిలిపివేత
- ఘజియాబాద్ను ముంచెత్తిన హిండన్ నది వరదనీరు
న్యూఢిల్లీ : ఎగువనుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దిల్లీలో యమునమ్మ మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది.. 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా ఉద్ధృతితో రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దిల్లీ -షాహదారా మధ్య రాకపోకలు నిలిపేశామని, రైళ్లు న్యూదిల్లీ మీదుగా మళ్లించామని వివరించారు. యమునా నది నీటిమట్టం పెరగుతుండడం వల్ల.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభావం పడుతోందని దిల్లీ సర్కార్ తెలిపింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు యమునా నది నీటిమట్టం 206.54 మీటర్లకు పెరిగిందని కేంద్ర జల కమిషన్ వెల్లడిరచింది. సోమవారం సాయంత్రానికల్లా యమునా నది నీటి ఉద్ధృతి తగ్గే అవాకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జులై 25 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దిల్లీ వణికిపోతోంది. హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా వరద పోటెత్తితే దేశ రాజధాని మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా దిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 208.05 మీటర్లకు చేరింది. ఇటీవల దేశ రాజధాని దిల్లీని యమునా నది వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలతో పాటు రాజ్ఘాట్ నుంచి దిల్లీ సచివాలయం వరకు ఉన్న ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రుల కార్యాలయాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు.. కాలువలను తలపించాయి. మోకాళ్లు లోతుకుపైగా వరదనీరు నిలిచిపోయింది. యమునా నదిలో నీటి ప్రవాహం గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తుండటం వల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. హరియాణాలోని హత్నికుంద్ బ్యారేజ్ నుంచి తక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. నది సమీపంలోని రోడ్లు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు కాపాడడం చాలా మఖ్యమని.. అందుకోసంప్రజలు సహకరించాలని సీఎం కోరారు. గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు. యమునాకు ఉపనది అయిన హిండన్ నదిలో నీటి విడుదల పెరగడంతో వరదలు ముంచెత్తాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందం, సాహిబాబాద్ పోలీసులు మోటర్బోట్లను ఉపయోగించి గ్రామంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మరికొందరిని బంధువుల ఇళ్లకు తరలించినట్లు సాహిబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భాస్కర్ వర్మ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హిండన్ నీటి మట్టం పెరగడంతో యమునా మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హిండన్ నది అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న కట్టమీదుగా వరదనీరు పారింది. దీంతో అడవులు, సమీపంలోని కాలనీలు నీట మునిగాయి. స్థానిక యంత్రాంగం సిటీ పార్కును కూడా మూసివేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం తర్వాత హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి విడుదల చేయడంతో ఆదివారం ఢల్లీిలోని యమునా నీటి మట్టం మళ్లీ 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని అధిగమించింది.
తప్పక చదవండి
-Advertisement-