Saturday, April 27, 2024

బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైంది…

తప్పక చదవండి
  • ఆట మీరే మొదలు పెట్టారు.. ఇక వేటాడ్డం మా వంతు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టాలి..
  • పేదలకు ఇండ్లు కట్టేందుకు డబ్బులు ఉండవా?
  • 9 ఏండ్లలో ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదు
  • బాటసింగారం డబుల్​ ఇండ్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటి..?
  • రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి ఫైర్​
  • బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి..

బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్​ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నా రు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు శంషాబాద్‌ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ.. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అనంతరం అక్కడ కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణిచివేస్తారా? అని దుయ్యబట్టారు.

‘‘ తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లూ వారికి ఇవ్వడం లేదు. భారాసపై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇళ్లను చూద్దామని బయలుదేరాం. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద నన్ను అడ్డుకున్నారు. పలువురు నేతలనూ అరెస్ట్ చేశారు. ఇవాళ ధర్నా, ఆందోళన కాదని చెప్పినా.. పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. బడుగు బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుసుకోవడానికి వెళ్తే ఇలా వ్యవహరిస్తారా?

- Advertisement -

తండ్రిని అడ్డం పెట్టుకొని మాకు పదవులు రాలేదు :
ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. నాతో అలా వ్యవహరించారు. పోలీస్ కమిషనర్, డీసీపీలు కలిసి అమానుషంగా ప్రవర్తించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో ప్రజలు తమ నీడను తామే చూసుకొని భయపడాల్సి వస్తోంది. ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్‌ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రజల ఆవేదన, ఆక్రోశం.. భాజపా నేతల అరెస్టులతో తగ్గదు. ఈరోజు యుద్ధం మొదలైంది. కల్వకుంట్ల కుటుంబం, భారాసతో యుద్ధానికి మేం సిద్ధం. ప్రజల సమస్యల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తాం. మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. ఎన్నో సార్లు జైలుకు వెళ్లాం. తండ్రిని అడ్డం పెట్టుకొని మాకు పదవులు రాలేదు. భారాస పాపాలు పండాయి. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు ఇవాళ్టి పరిణామాలపై ఆలోచించాలి’’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత తనదేనన్నారు. బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవని ప్రశ్నించారు. పేదల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అరకొరగా కట్టిన ఇండ్లు కూడా 9 ఏళ్లుగా ఎవరికి ఇవ్వ లేదన్నారు. తొమ్మిది సంవత్సరాలైనా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని, చేతకాని ప్రభుత్వం అంటూ విమర్శించారు. కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారు కాబట్టే బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

నన్ను చంపేయండి.. నేను ఇంటికి మాత్రం వెళ్ళను :
అంతకు ముందు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ఎయిర్​పోర్ట్​కు చేరుకోగానే.. పోలీసులు బాటసింగారంలోని డబుల్​ ఇండ్లను పరిశీలించేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కాగా భారీ వర్షంలోనూ కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి శంషాబాద్​ ఔటర్ రింగ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన బాట సింగారం వెళ్లి తీరుతా. నేనేమైనా క్రిమినల్ నా? కేంద్ర మంత్రిని అడ్డుకుంటారా? పోలీసు వెహికిల్ అడ్డుపెట్టి ఆపుతారా? నిజాం కన్నా అధ్వానమైన పాలన ఇక్కడ ఉంది’ అని మండ్డిపడ్డారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజా సమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని, పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లా పోలీసులు వ్యవహరించాలన్నారు. కేంద్రమంత్రి కాన్వాయ్ కు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన నడుస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలని హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మా అధ్యక్షున్ని ఎందుకు అరెస్ట్ చేశారు..?
ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టును కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఇది కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్ఠ అని బండి సంజయ్ అన్నారు. అసలు కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ 100 గదుల ఇంటిలో కేసీఆర్ ఉంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు నిజాయతీ ఉంటే డబుల్ బెడ్రూం ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలన్నారు. కిషన్ రెడ్డిని అడ్డుకొని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని ధర్మపురి అరవింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు. కిషన్ రెడ్డికి లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, బాలీవుడ్ వాళ్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 4 కోట్ల ఇళ్లు నిర్మితమయ్యాయన్నారు. కానీ తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటన్నారు. గృహ నిర్మాణ శాఖలో 1,821 మందికి 500 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారన్నారు. గృహ నిర్మాణ శాఖ బంద్ అయితే పని ఎలా జరుగుతుందని వారు ప్రశ్నించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు