- ఇప్పటి వరకూ 2,50,963 అప్లికేషన్లు..
- సెప్టెంబర్ 15న టెట్ పేపర్ 1, 2 ల పరీక్షలు..
హైదరాబాద్ : తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 2వ తేదీ నుంచి తెలంగాణ విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించింది. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకునేందుకు అవకాశం ఉన్నది. అయితే, అంచనా మేరకు రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా.. కొత్తగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉండనున్నారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కనున్నది.