తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించారని వెల్లడించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బతుకమ్మ కుంట ఫారెస్ట్ నర్సరీలో ఏర్పాటుచేసిన హరితోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. భావితరాలకు స్వచ్ఛమైన , కాలుష్య రహిత హరిత తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ణాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం ఒకటని అన్నారు. అందరికీ అందుబాటులో మొక్కలను అందించడం కోసం గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి అందుబాటులోని అనేక రకాల మొక్కలను పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఫారెస్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఫారెస్ట్ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.