తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్కు క్రిమినల్స్ అండగా ఉన్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జగన్ దోపిడీదారుడు.. నేరస్తుడని అన్నారు. 2009లోనే తాను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటే జగన్ను రానిచ్చేవాడిని కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉందనే అహంకారంతో తాను ఓడిపోయానని నోటికొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడికి నోటిదూల ఎక్కువైందని మండిపడ్డారు. డెకాయిట్ ద్వారంపూడికి బుద్ధి చెప్పాలనే కాకినాడ వచ్చానని స్పష్టంచేశారు.
స్థానిక ఎమ్మెల్యేలపై తనకు కోపం లేదని చెబుతూనే కౌన్ కిస్కాగాళ్ల గురించి పట్టించుకోనని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కౌన్ కిస్కా అన్నందుకు క్షమించాలని ప్రజలను కోరారు. సీఎం జగన్ అండ చూసుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. కాకినాడ నడిబొడ్డు నుంచి ద్వారంపూడికి చెప్తున్నా ఇంకోసారి కులదూషణతో రెచ్చగొట్టేలా చేస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. తాను కోరుకుంటున్నది రాష్ట్ర ప్రజల సంక్షేమమని.. కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. రౌడీ, గుండా, లూటీదారుడు ద్వారంపూడికి చెప్తున్నా.. కాకినాడలో నిన్ను గెలవకుండా చేస్తానని సవాలు విసిరారు.
ఏ గుండా గాడు వచ్చినా.. కాకినాడ ప్రజలకు తన ప్రాణం అడ్డు వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక ఎంపీ కొడుకు, భార్యను కిడ్నాప్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఒక వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని సీరియస్ అయ్యారు. నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వచ్చి తనను కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు అధికారం వచ్చిన తర్వాత వాళ్లను వీధుల్లో తరుముకుంటూ తీసుకెళ్తానని స్పష్టం చేశారు.