- వినాశనానికి గురైన మరో ఆఫ్రికన్ దేశం..
- విధ్వంసం సృష్టిస్తున్న డేనియల్ తుఫాను..
- తుఫాన్, ఆకస్మిక వరదలతో జల ప్రళయం
- 2 వేల మంది మృతి, 6 వేల మంది గల్లంతు..
- డ్యామ్లు తెగిపోవడంతో వరదలో మునిగిన నగరం..
లిబియా: ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది. వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే 2000 మందికి పైగా మరణించారు. తూర్పు ప్రాంతంలో ఎక్కువ విధ్వంసం సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్యామ్లు పగిలిపోవడంతో ఏకంగా డెర్నా నగరం పూర్తిగా మునిగిపోయింది. దీంతో 2 వేల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. మరో 6 వేలమంది కొట్టుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాత్రి నిశ్శబ్ధంగా ఉన్న నగరంలో ఉదయం వరకు తుఫాన్ విలయం సృష్టించింది. ఎటు చూసినా కూలిపోయిన బిల్డింగ్లు, కొట్టుకుపోయిన శవాలు, వాహనాలతో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే టెర్రరిజం, అశాంతితో నిత్యం ఘర్షణలు జరిగే డెర్నా నగరంలో డేనియల్ తుఫాన్ మరింత పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం డెర్నా నగరంలో తుఫాన్ బీభత్సానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డెర్నా నగరం సమీపంలో ఉన్న రెండు డ్యామ్లు తెగిపోయి వరద ఒక్కసారిగా నగరంలోకి దూసుకురావడంతో ఆకస్మిక వరదలు పోటెత్తి జనం కొట్టుకుపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కొండలు, గుట్టల మధ్య నుంచి డెర్నా నగరం గుండా ప్రవహించే నది పరిసరాల్లో ఉన్న ఇళ్లు, భవనాలు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. ఎన్నో అపార్ట్మెంట్లు బురదలో కూరుకుపోయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
తుఫాన్, వదల కారణంగా అనేక కార్లు నీటిలో మునిగాయి. భవనాలు కుప్పకూలాయి. రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. లిబియా తాజాగా పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని ఒసామా హమద్ తెలిపారు. డేనియల్ తుఫాను ప్రాంతం ప్రభావం దేశం అంతటా ఉందని.. ముఖ్యంగా సముద్ర తీరప్రాంత పట్టణాల్లో విధ్వసం భారీ ఉందని.. అనేక ఇళ్ల కూలిపోయాయని తీర ప్రాంతంలోని రెండు పాత ఆనకట్టలు విరిగిపోయాయని.. దీంతో డెర్నా పట్టణంతో బయట వ్యక్తులకు మధ్య సంబంధాలు “పూర్తిగా తెగిపోయాయని” తెలుస్తోంది. అంతేకాదు తూర్పు నగరమైన బైడాలోని ఆసుపత్రుల పరిస్థితిని తెలియజేస్తూ.. బెయిడా మెడికల్ సెంటర్ ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియో ద్వారా అక్కడ పరిస్థితి లోకానికి తెలుస్తోంది. తూర్పు లిబియా ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్జలీల్ సోమవారం మధ్యాహ్నం మరణించిన వారి సంఖ్యను ప్రకటించారు. కనీసం 50 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఈ మృతుల సంఖ్యలో విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన డెర్నా నగరంలో మృతుల సంఖ్యను కలపలేదని చెప్పారు. ఇక్కడ పరిస్థితిపై ఇంకా స్పష్టంగా లేదు. మృతుల్లో తూర్పు నగరమైన బైడాకు చెందిన 12 మంది ఉన్నారని నగరంలోని ప్రధాన వైద్య కేంద్రం తెలిపింది. ఈశాన్య లిబియాలోని తీరప్రాంత నగరం సుసాలో మరో ఏడుగురు మరణించినట్లు నివేదించబడింది. షాహత్ , ఒమర్ అల్-ముక్తార్ పట్టణాలలో మరో ఏడుగురు మరణించినట్లు మంత్రి తెలిపారు.
ఆదివారం మరో వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. తూర్పు లిబియాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ ప్రతినిధి వాలిద్ అల్-అర్ఫీ ప్రకారం ఆ వ్యక్తి తన కారులో ఉన్నాడు. తూర్పు నగరమైన మార్జ్లో వరదల్లో చిక్కుకున్నాడు. మీడియా నివేదికల ప్రకారం డజన్ల కొద్దీ ఇతర వ్యక్తులు వరదలో కొట్టుకుని పోయినట్లు పేర్కొంది. ఇలా వరదల్లో కొట్టుకుని పోయినవారు మరణించి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా తూర్పు లిబియాలోని అనేక నగరాల్లో ఇళ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం శనివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాత్రిపూట సంభవించిన తుఫానుకు ముందు ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు మూసివేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రతికూల వాతావరణం ఉంటుందని ఆ దేశ వాతావరణ అధికారులు హెచ్చరించారు.