- షిప్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు సమాచారం
- హైజాక్ సమాచారాన్ని యూకే మారిటైమ్ ఏజెన్సీకి పంపిన నౌక
- రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ
- ఐఎన్ఎస్ చెన్నైతోపాటు ఎయిర్క్రాఫ్ట్ను పంపిన నేవీ
- సిబ్బంది క్షేమంగానే ఉన్నారన్న అధికారులు
హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న నౌక హైజాక్ అయింది. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. హైజాక్ సమాచారాన్ని గురువారం సాయంత్రం యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సందేశం పంపింది. గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే ఇండియన్ నేవీ అప్రమత్తమైంది. రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. దీంతో హైజాక్కు గురైన షిప్ ‘ఎంవీ లిలా నార్ఫోక్’ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించారు. ఇండియన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్.. ఆ ఎంవీ లిలా నార్ఫోక్ నౌకపై నిఘా ఉంచిందని నేవీ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆ హైజాక్ అయిన నౌకలో ఉన్న సిబ్బందితో కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. అయితే ఆ ఎంవీ లిలా నార్ఫోక్ షిప్ను ఎవరు హైజాక్ చేశారు.. ఎందుకు చేశారు అనే విషయాలు ఇప్పటివరకు వెల్లడి కాలేదు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి అలర్ట్ అయిన ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దించింది. హైజాక్కు గురైన ఎంవీ లిలా నార్ఫోక్ షిప్ వైపు ఐఎన్ఎస్ చెన్నై వార్ షిప్ కదులుతున్నట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. గురువారం సాయంత్రం ఈ నౌక హైజాక్కు గురైనట్లు తెలిపింది.