- తరుణ్చుగ్, కిషన్ రెడ్డి సమక్షంలో చేరిక
- కాషాయ కండువా కప్పి ఆహ్వానం
న్యూఢిల్లీ : సహజ నటిగా పేరు పొందిన ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి కండువా కప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డికె అరుణ తదితరులు కూడా జయసుధ వెంట ఉన్నారు. అనంతరం జయసుధ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి మోడీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీలో చేరుతున్నానని జయసుధ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో ఏడాదిగా సంప్రదింపులు జరుపుతున్నానని,
మొత్తానికి నేడు బీజేపీలో చేరినట్లుగా వెల్లడిరచారు. తన వర్గం అయిన కైస్త్రవుల ప్రతినిధిగా తాను గళం వినిపిస్తానని జయసుధ వెల్లడిరచారు. జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ క్రమంలో బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల అత్యధికంగా కైస్త్రవులు ఉంటారు. అందుకే సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ ఉందని భావిస్తున్నారు. గతంలో ముషీరాబాద్ నుంచి బీజేపీ తరపున సీనియర్ నేత కె. లక్ష్మణ్ పోటీ చేసేవారు.ఆయన ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జయసుధ నాలుగేళ్ల క్రితం వైఎస్ఆర్ సీపీలో చేరినప్పటికీ అటు ప్రభుత్వం ఆమె సేవలను ఉపయోగించుకోలేదు.తొలుత 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.. తరవాత కొన్నాళ్ళకి టీడీపీలో చేరారు. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019లో వైఎస్ఆర్ సీపీలో సీఎం జగన్ సమక్షంలో చేరారు. తాజాగా బీజేపీలో చేరారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జయసుధ బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి, దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటించారన్నారు. ఆమె రాక బీజేపీకి లాభమని, బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి కోసం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృషి చేశారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని యావత్ తెలంగాణ కోరుకుంటోందన్నారు.
తప్పక చదవండి
-Advertisement-