- జూనియర్ లైన్మెన్ నియమకాల్లో భారీ ఎత్తున అవకతవకలు
- టీఎస్ఎస్పీడీసీఎల్లో అధికారుల అవినీతి మాయాజాలం
- స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% ఉద్యోగ అవకాశం
- ముడుపులు తీసుకొని స్థానికేతరులకు ఉద్యోగాలు
- హైదరాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోగస్ బోనాఫైడ్ల దందా
- లక్షల్లో వసూలు చేసి నకిలీ బోనాఫైడ్లు జారీ చేసిన అధికారులు
- బోగస్ సర్టిఫికేట్ జారీ చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ, డీఈఓ లకు ఫిర్యాదులు
ఎంతో కష్టపడి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారు.. పిల్లలు వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా చదువు పూర్తిచేసి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు.. వారి సాధనలో ఎలాంటి లోపం ఉండదు.. కానీ లోపభూయిష్టమైన గత ప్రభుత్వం, అందులో విధులు వెలుగబెట్టిన కొందరు అవినీతి అధికారులు.. వారి ఆశలపై నీళ్లు జల్లారు..
అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం కల్పించకుండ, అక్రమ నియమకాలకు తెరలేపి వారి జీవితాల్లో చీకట్లను నింపారు. అలాంటిదే టీఎస్ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్ నియమాకాల వ్యవహారం జరిగింది.
టీఎస్ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్ (జెఎల్ఎం) 1,553 పోస్ట్స్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను (నెం.02/2023) 2023 ఫిబ్రవరి 2వ తేదిన విడుదల చేశారు. ఆ సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండి అర్హులైన అభ్యర్థులకు జెఎల్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించింది. జెఎల్ఎం రిటన్ ఎగ్జామ్ ఏప్రిల్ 30, 2023న, పోల్ ఎక్కే టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఆ టెస్ట్లకు మార్కులకు కూడా కేటాయించారు.. అందులో భాగంగానే హైదరాబాద్ జిల్లాలో 272 పోస్టులు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ కొందరు అధికారులు అక్రమ దందాకు తెరలేపారు. నోటిఫికేషన్ ప్రకారం స్థానికులకు 95శాతం, స్థానికేతరులకు 5శాతం ఇవ్వడంతో, ఇదే అదునుగా భావించిన కొందరు అవినీతి అధికారులు స్థానికేతరులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని, హైదరాబాద్ జిల్లాలో విద్యాభ్యాసం చేసినట్లు బోగస్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ద్వారా.. అధికారులకు ముడుపులు చెల్లించి, ఉద్యోగాలను సంపాదించారు. ఒక్కొక్క ఉద్యోగానికి లక్షల రూపాయాలు అధికారులకు అందినట్లు సమాచారం. ఆదాబ్ హైదరాబాద్ కు అందిన నకిలీ సర్టిఫికేట్ల అభ్యర్థుల వివరాలు..
- కొడావత్ నరేందర్ తండ్రి కొడావత్ రాంచందర్ చదువుకున్నది ప్రగతి విద్యాలయంలో 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు, 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు నిర్మల విద్యాలయ కల్వకుర్తిలో చదివారు. కానీ 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు హైదరాబాద్లోని చార్మినార్ మండలం, ఫౌంటెన్హెడ్ హై స్కూల్లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- అజ్మీర రాకేశ్, తండ్రి నీతు నాయక్ చదువుకున్నది ఎస్.ఆర్ నేషనల్ హైస్కూల్, రోడ్ నెం.1, అడ్వకేట్ కాలనీ, నక్కలగుట్ట, హన్మకొండలో 1వ తరగతి నుండి 10వ తరగతి చదివారు. కానీ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సికింద్రాబాద్లోని వార్షిగూడ, ఎం.కె నగర్లోని నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- నూనావత్ బాలాజీ, తండ్రి నూనావత్ హరిదాస్ చదువుకున్నది ఎంపిపిఎస్, మాణిక్యరాం సింగరేణి మండలం, ఖమ్మం జిల్లాలో 1వ తరగతి నుండి 4వ తరగతి చదివారు. కానీ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సికింద్రాబాద్ ముషిరాబాద్ మండలంలోని శ్రీ వివేకానంద హై స్కూల్లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- జర్పాల రామారావు, తండ్రి జర్పాల కిషన్ చదువుకున్నది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కామేపల్లి, ఖమ్మం జిల్లాలో 1వ తరగతి నుండి 6వ తరగతి, 7వ తరగతి భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల కిన్నెరసానిలో చదివారు. కానీ 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు హైదరాబాద్లోని ఖైరతాబాద్లోని సెయింట్ విన్సెంట్ హై స్కూల్లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- శ్రీను నాయక్ కొర్రా, తండ్రి దీప్ల చదువుకున్నది బొర్రాయిపాలెం, త్రిపురాం మండలం, నల్గొండ జిల్లాలో 3వ తరగతి నుండి 7వ తరగతి చదివారు. కానీ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలంలోని విద్యాసాగర్ స్కూల్లో చదివినట్లు ఫేక్ బోనోఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- కొర్ర రాజ్కుమార్, తండ్రి కొర్రా సత్యనాయక్ చదువుకున్నది తూర్పుతండా, గ్రామం షరియప్పరెడ్డిపల్లి గ్రామం, చారకొండ మండలం, నాగర్కర్నూల్ జిల్లాలో 1వ తరగతి నుండి 5వ తరగతి చదివారు. కానీ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు హైదరాబాద్లోని అంబర్పేటలోని షిర్డీ సాయిబాబా స్కూల్లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- కేతావత్ సందీప్, తండ్రి కేతావత్ రెడ్యా చదువుకున్నది అక్కారం గ్రామం, అచ్చంపేట మండలం నాగర్కర్నూల్ జిల్లాలో 1వ తరగతి నుండి 3వ తరగతి చదివారు. అదే మండలంలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి నుండి 10 వరకు చదివారు. కానీ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు హైదరాబాద్లోని బండ్లగూడ మండలంలో సెయింట్ పీటర్స్ హైస్కూల్ జంగంమట్, ఫలక్నామా లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది.
- కొడావత్ రామచందర్, తండ్రి కోడావత్ జాను చదువుకున్నది భగత్సింగ్ తండా, కల్వకుర్తి మండలం, నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రగతి విద్యాలయం, నిర్మల విద్యాలయాల్లో 1వ తరగతి నుండి 7వ తరగతి చదివారు. కానీ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సికింద్రాబాద్లోని రాణిగంజ్లోని శ్రీ సాయి బాలనికేతన్ హైస్కూల్లో చదివినట్లు ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికేట్ను పాఠశాల యాజమాన్యం ఇవ్వడం జరిగింది. ఈ నియమాకాల్లో 70శాతం పైగా అక్రమంగా నియమకాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. టీఎస్ఎస్పీడీసీఎల్లో గత ప్రభుత్వం అవినీతి అధికారులను నియమించుకొని, ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతోకాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం సన్నద్దమై, పోల్ ఎక్కడానికి కొందరు అభ్యర్థులు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. కానీ, స్వార్థ ప్రయోజనాలు కలిగిన టీఎస్ఎస్పీడీసీఎల్లోని కొంతమంది అధికారులు అనర్హులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని అర్హులైన అభ్యర్థులకు మోసం చేశారు. ఇప్పటికైనా ఈ అక్రమ నియమాకాలపై సమగ్రంగా విచారించి, అవినీతి అధికారులపైన, బోగస్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులపైన, చట్టపరమైన చర్యలు తీసుకోని, ఉద్యోగాల నుండి తొలగించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నారు.