- అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న విమానం
- టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం
- లాహోర్ నగరానికి ఉత్తర దిక్కుకు చేరుకున్న ఇండిగో ప్లైన్..
- అరగంట తర్వాత తిరిగి భారత్ లో ప్రవేశం
న్యూ ఢిల్లీ, ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే వాతావరణం మారిపోయింది. దాంతో ఆ ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. శనివారం ఈ సంఘటన జరిగినట్లు ఆ సంస్థ ఆదివారం పేర్కొంది. ఇండిగో ఎయిర్లైన్కు చెందిన 6ఈ-645 విమానం శనివారం సాయంత్రం పంజాబ్లోని అమృత్సర్ నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్కు బయలుదేరింది. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో ఆ విమానం దారి మళ్లింది. పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. సరిహద్దు నుంచి వంద కిలోమీటర్ల దూరంపైగా ఉన్న గుజ్రాన్వాలా వరకు సుమారు అరగంట పాటు పాకిస్థాన్ గగనతలంలో ఎగిరింది. కాగా, ఈ సంఘటనపై పాకిస్థాన్ పౌర విమానయాన అథారిటీ అధికారులు స్పందించారు. 454 నాట్ల వేగంతో ప్రయాణించిన ఇండిగో విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు లాహోర్కు ఉత్తరాన తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఆ విమానాన్ని గైడ్ చేయడంతో రాత్రి 8.01 గంటలకు తిరిగి భారత్ గగనతలంలోకి వెళ్లిందని చెప్పారు. అయితే ఇది అసాధారణ సంఘటన కాదని అన్నారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో విమానం దారి మళ్లేందుకు అంతర్జాతీయంగా అనుమతి ఉంటుదని వెల్లడించారు.
మరోవైపు మే 4న ఒమన్ రాజధాని మస్కట్ నుంచి లాహోర్కు వెళ్తున్న పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించింది. సుమారు 10 నిమిషాల పాటు ఎగిరిన తర్వాత తిరిగి వెళ్లింది. పాకిస్థాన్లో బాగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లాహోర్లో విమానం ల్యాండింగ్కు పైలట్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.