- కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాల భూ పందేరం
హైదరాబాద్ : కోకాపేట భూ అప్పగింత కేసులో బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆదేశించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ పై హైకోర్టు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో భూములు కేటాయించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అత్యంత విలువైన భూములు ఎలా కేటాయిస్తారని పిటిషనర్ పిల్ వేశారు. ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని, భూ కేటాయింపు డాక్యుమెంట్లు అన్నీ రహస్యంగా పెట్టారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కాగా హైదరాబాద్లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ 11 ఎకరాల భూములను మళ్లీ కేటాయించడం అక్రమమంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గండిపేట మండలం, కోకాపేట గ్రామంలో 239, 240 సర్వే నెంబర్లో ఎకరా రూ. 50 కోట్లు విలువ చేసే.. 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కేటాయించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
తప్పక చదవండి
-Advertisement-