- ఆదివారం సాయంకాలం ఒక్కసారిగా
మారిపోయిన వాతావరణం.. - పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం..
- ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు..
హైదరాబాద్ : ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, లింగంపల్లి, నిజాంపేట, జీడిమెట్ల, గాజులరామారం, కూకట్పల్లి, బాలానగర్, కొంపల్లి, అల్వాల్, బొల్లారం, నేరెడ్మెట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. ఇదిలావుంటే, రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలెర్ట్ జరీ చేసింది. ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.