Monday, May 6, 2024

చాళుక్కుల కాలం నాటి గణేశుని విగ్రహం లభ్యం

తప్పక చదవండి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ శివారులోని పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణీ చాళుక్యుల కాలంనాటి గణేశుని విగ్రహాన్ని చరిత్రకారులు గుర్తించారు. చరిత్ర పరిశోధకుడు డాక్టర్‌ ఎస్‌. జైకిషన్‌ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్‌, బీవి భద్రగిరీశ్‌లు పెద్దగోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం, ఆంజనేయ ఆలయాల్లోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శివాలయం ముందు మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల మందంతో నల్లశానపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం, కుడుము ఉన్నాయని, తలపై చిన్నకిరీటం, లలాటహారం, ఉదరబంధం, నాగయజ్ఞోపవీతం, బాహువలయాలు కంకణాలు, కాళ్ళకు కడియాలు ధరించి, లలితాసనంలో కూర్చొని ఉన్నాడని ప్రతిమాలక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం, క్రీ.శ.12వ శతాబ్దికి చెందిన కళ్యాణీ చాళుక్య శిల్పశైలికి అద్దం పడుతుందని చెప్పారు. గణేశుని విగ్రహం పక్కన కాకతీయ స్తంభం, కప్పురాయి, శిఖరశిథిలాలు, గ్రామంలోని ఆంజనేయాలయంలో క్రీ.శ.13వ శతాబ్దికి చెందిన చక్కటి ఉమామహేశ్వర శిల్పం, అద్భుతంగా అలంకరించిన నంది విగ్రహాలున్నాయని వీటిని శివాలయం నుంచి ఇక్కడికి తరలించినట్లు స్థానికులు చెప్పినట్లు వెల్లడిరచారు. పెద్దగోల్కొండలో గుర్తించిన గణేశ, ఉమామహేశ్వర, నంది విగ్రహాలు కళ్యాణీ చాళుక్య, కాకతీయుల కాలానికి చెందినవని, ఇవి హైదరాబాద్‌ నగర చరిత్రను మరో 4 వందల ఏండ్ల ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యం గల ఈ శిల్పాలపైనున్న రంగులను తొలగించి, పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో ఫలకాలను ఏర్పరచి, భద్రపరిచి భావితరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు