- ఈనెల 29న ఖమ్మం రాక..
- జిల్లా బీజేపీ శ్రేణుల్లో పెరిగిన జోష్..
- భారీ బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు..
- బీజేపీ వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేసిన అధిష్టానం..
ఖమ్మం : కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 29న అమిత్ షా ఖమ్మం రానున్నారు. ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, ఏ సమయానికి కేంద్ర మంత్రి ఖమ్మం టూర్ ఉంటుందనేది ఇంకా నిర్ణయం కాలేదు.. గతనెల 15న అమిత్ షా ఖమ్మం పర్యటనకు రావాల్సి ఉండగా గుజరాత్తోపాటు, పలు రాష్ట్రాల్లో తుఫాన్ కారణంగా అమిత్ షా ఖమ్మం పర్యటన వాయిదా పడిన విషయం విదితమే.. షా పర్యటన వాయిదా పడటంతో బీజేపీ శ్రేణులకు కొంత నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ఈనెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖరారు కావటంతో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలను కేంద్ర పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలకు కీలక పదవులు అప్పగించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ వంద రోజుల కార్యాచరణను కూడా ఖరారు చేసింది. ప్రజల్లోనే ఉంటూ విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండేందుకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా ఖమ్మం టూర్ బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపే అవకాశాలు ఉన్నాయి.