- మిడతల దండులా వాలిపోతున్నారు..
- ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా ప్రయత్నం..
- నన్ను టార్గెట్ చేస్తున్నారు.. ప్రజలే నన్ను గెలిపిస్తారు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన ములుగు మ్మెల్యే సీతక్క..
ములుగు : నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు. తాను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదని, అక్రమ కేసులు పెట్టించలేదని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తనను ఓడించాలని బీఆర్ఎస్ నేతలు మిడతల దండులాగా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల విూద ఉన్న ప్రేమ తమ నియోజకవర్గాల విూద ఉండటం లేదన్నారు. ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా అడ్డుకోవడానికి భారీ కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడ ఉంటుందన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టార్గెట్ చేస్తున్నారన్నారు. సీతక్క బాగా పనిచేస్తుందని అసెంబ్లీలో పొగుడుతున్నారని.. ఇక్కడికొచ్చి ఓడిస్తామంటున్నారని అన్నారు. ఏం తప్పు చేశానని తనను టార్గెట్ చేస్తున్నారని.. ప్రజల మధ్యనే ఉండడం తాను చేస్తున్న తప్పా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగులో భయాందోళనకు గురిచేస్తున్నారంటూ సీతక్క విరుచుకుపడ్డారు. ప్రజలే తన కుటుంబం అని, నియోజకవర్గ ప్రజలే తనను ఆశీర్వదిస్తారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు.