Wednesday, April 24, 2024

తెలంగాణ కోసం.. కేంద్రం 4 లక్షల కోట్లిచ్చింది..

తప్పక చదవండి
  • అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు
  • కేసీఆర్ మూర్ఖత్వ పాలనతో తిరోగమనంలో తెలంగాణ
  • తెలంగాణ బంగారమయమైతే ఏ వర్గాన్ని కదిలించినా
    కష్టాలు.. కన్నీళ్లే ఎందుకొస్తున్నాయ్?
  • కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చెరలో బందీగా మారింది
  • సొంత ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?
  • డిపాజిట్లు రాని కాంగ్రెస్ ను లేపేందుకు బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది
  • ఉద్యమకారులారా….తెలంగాణ ఉద్యమ స్ర్ముతులను యాదికి తెచ్చుకోండి
  • బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే పోరాటంలో భాగస్వాములు కండి..
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..

( బీజేపీ అధికారంలోకి రాగానే పేదలపై ఫీజుల భారం పడకుండా ఉచితంగా విద్య, వైద్యాన్ని అందిస్తాం.. నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం… ఫసల్ బీమా అమలు చేస్తాం.. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం… 25 వేల టీచర్ పోస్టులను నింపుతాం : బండి సంజయ్.. )

హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
‘‘తెలంగాణ అభివ్రుద్ది కోసం గత 9 ఏళ్లలో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయిలకుపైగా కేటాయించింది. 4 కోట్ల మంది ప్రజల కోసం ఆ డబ్బును కేటాయిస్తే నలుగురు దోచుకుంటున్నరు. తెలంగాణకు కేంద్రం ఇఛ్చిన నిధులతోపాటు, చేసిన అభివ్రుద్ధిపై చర్చకు రమ్మంటే…. రాకుండా కేసీఆర్ పారిపోతున్నడు. బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుని దేశమ్మీద పడ్డారు‘‘అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందన్నారు. ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే అన్ని వర్గాలు అసంత్రుప్తితో ఎందుకున్నాయో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ సాధన కోసం బీజేపీ చేసిన పోరాటాలను, అమరుల బలిదానాలను స్మరించుకున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, రాణిరుద్రమదేవి, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు..

- Advertisement -

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకారులను స్మరించుకుంటూ, తెలంగాణ సాధన కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసింది. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే… ‘‘మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ కల సాకారం చేస్తాం.‘‘అంటూ సుష్మ స్వరాజ్ పార్లమెంట్ వేదికగా చెప్పడమే కాక, తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించింది. పాతికేళ్ల క్రితమే ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో కాకినాడ తీర్మానం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షతో ఏర్పడ్డ తెలంగాణను అభివ్రుద్ధి చేసేందుకు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. తెలంగాణలో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతుందోంటే కేంద్రం ఇచ్చిన నిధులతోనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు అంతో ఇంతో బాగున్నారంటే మోదీ అమలు చేస్తున్న పథకాలే కారణం.. రామగుండం ఫ్యాక్టరీ కోసం 6 వేల 338 కోట్లు, జాతీయ రహదారుల కోసం 1.10 లక్షల కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం లక్ష కోట్లకుపైగా చెల్లించాం. మొత్తంగా 4 కోట్ల ప్రజల కోసం 9 ఏళ్లలో 4 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణలో సంపదను స్రుష్టించేందుకు లక్షల కోట్లు కేటాయిస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కేంద్ర పథకాలను అమలు చేయడం లేదు.

మరోవైపు దేశాన్ని అభివ్రుద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం అహర్నిశలు క్రుషి చేస్తోంది. ఆర్దిక ప్రగతిలో దూసుకుపోతోంది. ఇంగ్లండ్ ను దాటి ఆర్ధిక ప్రగతిలో 5వ స్థానానికి చేరుకుంది. 2047 నాటికి నెంబర్ వన్ కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా మూర్ఖత్వ పాలన కొనసాగుతోంది. కేంద్రం 4 కోట్ల ప్రజల కోసం 4 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే… కేసీఆర్ మాత్రం నలుగురి కోసం పంచుకుంటూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసింది. అభివ్రుద్దిపై చర్చకు రమ్మని అడుగుతుంటే… చర్చకు రాకుండా కేసీఆర్ పారిపోతున్నడు… కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే… రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయి ఏ రైతన్నను పలకరించినా ఎందుకు కన్నీళ్లే కారుస్తున్నారో చెప్పాలి. అన్నం పెట్టిన చేతులు వడ్లకుప్పలపై జీవచ్చాలుగా మారినయ్? ఏ నిరుద్యోగ తమ్ముడిని పలకరించినా పటపట పళ్లు కొరుకుతున్నడు? ఏ కార్మికుడుని, ఉద్యోగిని కదిలించినా కసితో రగిలిపోతున్నడు… ఏ అక్క, చెల్లెమ్మను చూసినా రాణిరుద్రమ్మలా, కాళికాదేవిలా హుంకరిస్తోంది? తెలంగాణ సాధుంకున్నది ఇందుకోసమేనా అని బాధాతప్త హ్రుదయాలే కన్పిస్తున్నయ్. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేసింది. వాళ్ల బాధలను పంచుకుంది. సమస్యలన్నీ తెలుసుకున్నాకే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించాం. ఎందుకంటే విద్య కోసం ఒక్కో కుటుంబం సగటున రూ.లక్ష ఖర్చు చేస్తోంది. వాళ్లపై ఎనలేని భారం పడుతోంది. ప్రభుత్వ స్కూళ్లను చూస్తే అధ్వాన్నంగా మారాయి. కనీస వసతుల్లేవ్? చాక్ పీసులకు కూడా డబ్బుల్లేని దుస్ధితి. ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతాం. 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయంబర్స్ మెంట్లు బకాయిల్లేకుండా చెల్లిస్తాం. ప్రతి ఏటా ముందుగానే ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులపై భారం పడకుండా చూస్తాం.

పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం. ఎందుకంటే.. ఈరోజు సగటున ఒక్కో కుటుంబం 50 వేల నుండి లక్ష రూపాయలు ఖర్చు చేస్తోంది. పెద్ద పెద్ద రోగాలొస్తే వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేక ప్రాణాలు గాల్లో కలిసే దుస్థితి ఏర్పడింది. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. అట్లాగే నిలువ నీడలేని పేదలు ఎంతోమంది ఉన్నరు. కిరాయిలు కట్టలేక అల్లాడుతున్నరు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగే అలాంటి వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఏనాడూ కేసీఆర్ ఫ్రభుత్వం ఆదుకోలేదు. ఇటీవల ఎకరాకు రూ.10 వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చినా 5 పైసలు కూడా సాయం చేయలేదు. ఉచితంగా యూరియా, విత్తనాలు ఇస్తానని మాట తప్పారు. రుణమాఫీని అమలు చేయడం లేదు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే రైతును ఆదుకుంటాం. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి పంట నష్టపోయిన రైతుకు సాయం అందిస్తాం. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భ్రుతి ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలుపుకోలేదు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపనే తప్ప ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగే ఖాళీ ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాం. వస్తుంటే ఎక్కడ చూసినా కేసీఆర్ హోర్డింగ్స్ కన్పిస్తున్నయ్. యాడ్స్ కన్పిస్తున్నయ్… ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఎంఓ నుండి పంపిన స్ర్కిప్ట్ ప్రకారమే ప్రచారం చేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. చివరకు పోలీసులను కూడా మఫ్టీలో వెళ్లి ప్రచారం చేయాలని, లేనిపక్షంలో ప్రమోషన్లు ఇవ్వబోమంటూ బెదిరించే స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం చేరుకుంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతిలో బందీ అయ్యింది. తెలంగాణ బంగారమైతే… రైతుల ఆత్మహత్యల్లో ఎందుకు అగ్రస్థానంలో ఉంటుంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటరు? జీతాలు రాక ఆర్టీసీ ఉద్యోగులెందుకు చనిపోతున్నరు? 317 జీవోవల్ల ఉద్యోగులెందుకు చెట్టుకొకరై నేలరాలిపోతున్నరు….అరే.. నిండు నూరేళ్ల జీవితమున్న ముక్కుపచ్చలారని విద్యార్థులెందుకు చనిపోతున్నరు? సింగరేణని అథోగతి పాలెందుకైంది. అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డున పడ్డరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదల పరిస్థితి దారుణంగా మారింది. అందుకే బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతోంది. ప్రజలు గుర్తించి మార్పును కోరుకుంటున్నరు. బీజేపీయే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నరు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిపించారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికలు సహా ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లు రాలేదు. అయినా కాంగ్రెస్ ను లేపేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. సిద్దాంతం కోసం, ప్రజల కోసం తెగించి కొట్లాడే పార్టీ. ప్రాణత్యాగాలకు వెనుకాడని పార్టీ. బీజేపీని అడ్డుకోవాలని చూస్తే ఆగే పార్టీ కాదు… ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నమో ఆ ఆశయ సాధన కోసం పోరాడుతున్నం. తెలంగాణలో రామరాజ్య స్థాపన కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడేదాకా పోరాడతాం. ఒక్కసారి ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమాలను గుర్తుకు చేసుకోండి. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె స్పూర్తితో పోరాడదం.. బీజేపీతో కలిసి రావాలని కోరుతున్నా. బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ చేసే పోరాటాలకు కలిసి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు