- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల కమిషన్, జమ్మూ-కశ్మీరు ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయని తెలిపింది. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో పురపాలక సంఘాల ఎన్నికలు, మూడో దశలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని వివరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వివరాలను గురువారం తెలిపారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. గతంలో రాష్ట్రంగా ఉన్న జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చాలా అవసరమని కేంద్రం వాదించింది. సుప్రీంకోర్టు మంగళవారం స్పందిస్తూ, జమ్మూ-కశ్మీరులో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగడం తప్పనిసరి అని తెలిపింది. ఇక్కడ 2018 జూన్ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని గుర్తు చేసింది. జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా ఇవ్వడానికి కాల పరిమితిని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం తిరస్కరించింది. అధికరణ 370ని రద్దు చేయడంలోనూ, రాష్టాన్న్రి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంలోనూ సముచిత పక్రియను అనుసరించారా? లేదా? అనే అంశంపై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని సొలిసిటర్ జనరల్ చెప్పడంతో అక్కడి నేతలు, పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. లడఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేయడంతోపాటు, జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. సరైన సమయంలో జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పట్లో పార్లమెంటుకు చెప్పారు. కానీ సమయాన్ని నిర్దేశిరచలేదు.