Saturday, July 27, 2024

భోజనం పెట్టలేదని భార్యని చంపేసిన భర్త

తప్పక చదవండి

జోధ్‌పూర్‌: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ జిల్లాలోని మాతా కా థాన్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రమేశ్‌ బేనివాల్ (35), సుమన్‌ బేనివాల్‌ (32) ఇద్దరూ భార్యాభర్తలు.
15 ఏళ్ల క్రితం వారి వివాహం జరిగింది. వారి ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. సుమన్‌ బేనివాల్‌ రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రమేశ్‌ వ్యాపారి. తన వ్యాపారం నిమిత్తం అతను తరచూ జోధ్‌పూర్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి కూడా జోధ్‌పూర్‌ వెళ్లి లేట్‌ నైట్ ఇంటికివచ్చాడు. భార్యను భోజనం వడ్డించమని అడగ్గా ఆమె నిరాకరించింది.
దాంతో ఆగ్రహించిన రమేశ్‌ ఇంట్లో బండరాయితో ఆమె తలపై కొట్టాడు. ఆ రాయి తలకు బలంగా తగలడంతో సుమన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య హత్య అనంతరం ఇంటి తలుపులు మూసేసిన రమేశ్‌.. తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అతను తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటికి వచ్చే వరకు రమేశ్‌ లోపలి నుంచి డోర్‌ లాక్‌ చేసుకుని భార్య మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సుమన్‌ బేనీవాల్‌ రాజకీయాల్లో రాకముందు ఓ గ్యాస్‌ స్టేషన్‌లో ఉద్యోగం చేసేదని స్థానికులు చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు