Friday, May 3, 2024

తెలంగాణ రాష్ట్రం కాల గర్భంలో కలవాల్సిందేనా..?

తప్పక చదవండి
  • కెమికల్ పరిశ్రమల కాలుష్యంతో కమ్ముకొస్తున్న ముప్పు..
  • ప్రజా ప్రయోజనాలకంటే ఆర్ధిక వనరులే సర్కారుకు ముఖ్యమా..?
  • విదేశీ కంపెనీలు సైతం భారత్ లో ప్రరిశ్రమలు నెలకొల్పడానికి కారణం ఏమిటి..?
  • కాలుష్యం వెదజల్లుతాయని పరిశ్రమలకు అనుమతి ఇవ్వని అక్కడి ప్రభుత్వాలు..
  • తెలంగాణ రాష్ట్రంలో సైతం ఇబ్బడి ముబ్బడిగా కెమికల్ కంపెనీలు..
  • ప్రజారోగ్యం దెబ్బతింటుందని తెలిసినా అనుమతులు..
  • పడకేసిన తెలంగాణా కాలుష్య నియంత్రణ మండలి..
  • తాత్కాలిక ఆదాయంకోసం అర్రులు చాస్తున్న కొందరు అధికారులు..
  • తామేమీ తక్కువ కాదంటున్న అధికార పార్టీ పెద్దలు..
  • జీఓ నెంబర్ : 20 అమలు చేసి ప్రకృతితో బాటు ప్రజలను రక్షించాలి..
  • పది రూపాయల గోళీ సుమారు రూ. 100కి అమ్ముతున్న కొన్ని కంపెనీలు..

ప్రజల ఆరోగ్యానికి మెడిసిన్ తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు.. ఆరోగ్యం మాట అటుంచితే నిలువునా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి.. కెమికల్ కంపెనీలు స్థాపించే సమయంలో కొన్ని విధి, విధానాలు పాటిస్తామని అక్షరం సాక్షిగా ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకునే కంపెనీ యాజమాన్యాలు.. ఆ తర్వాత వాటిని అటకెక్కించేస్తున్నాయి.. కంపెనీల యాజమాన్యాలతో చేతులు కలిపిన కొందరు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ జేబులు నింపుకుంటూ అమాయకుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.. కెమికల్ కంపెనీల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదు.. ఆరోగ్యం కోసం తయారయ్యే ఔషధాలను తయారు చేయకూడదనే నిబంధన ఎక్కడా లేదు.. కానీ కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉండగా వాటికి తిలోదకాలు ఇవ్వడమే ఇక్కడ ప్రమాదకరంగా మారింది.. మందుల తయారీ ప్రక్రియలో విపరీతమైన వ్యర్ధాలు వెలువడుతాయి.. వాటిని ఒక క్రమపద్ధతిలో శుద్ధి చేసి తిరిగి వాడుకోవాలని రూల్ ఉంది.. కానీ ఈ విషయాన్ని ఎవరూ పాటించడం లేదు.. పైగా అక్రమంగా వ్యర్ధాలను నాలాలలోనూ, చెరువులలోనూ, కుంటల లోనూ వదిలేస్తున్నారు.. దీనితో పరిసర ప్రాంతాలు విషతుల్యం అవుతూ దుర్గంధ భరితంగా మారిపోతున్నాయి.. దీనితో ప్రజల ఆరోగ్యాలతో పాటు, నోరులేని జీవుల ఆరోగ్యాలు కూడా నాశనం అవుతున్నాయి.. ఆ ప్రాంతాలలో నేల, నీరు, వాయువు కూడా కలుషితం అయిపోతున్నాయి.. దీంతో పచ్చని ప్రకృతి సర్వనాశం అవుతూ.. ప్రజల జీవితాలు చిన్నా, భిన్నం అవుతున్నాయి.. మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. విదేశీ సంస్థలు సైతం భారత దేశంలో కెమికల్ పరిశ్రమలు స్థాపించడానికి ఉవ్విల్లూరుతున్నాయి.. దానికి కారణం తమ దేశాల్లో ప్రాణాంతకమైన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకపోవడమే అన్నది నిర్విదాంశం.. అయితే అలాంటి వారికి ఇండియా, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నాయి.. ఈ ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యాలకంటే, ప్రకృతి పరిరక్షణ కంటే ఆదాయ మార్గాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయి.. ఈ వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కంపెనీలు తమ స్వార్ధ ప్రయోజనాలు, సంపాదనే ముఖ్యంగా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నాయి.. చివరికి రూ. 10 విలువ చేసే ఒక మాత్రను సుమారు రూ. 100 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయంటే ఏ మేరకు బరితెగించాయో అర్ధం చేసుకోవచ్చు.. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలారా ఒక్కసారి మీ గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించండి.. కేవలం ప్రజలే కాదు ముఖ్యమంత్రి, వారి కుటుంబసభ్యులు కూడా ఈ కాలుష్య భూతానికి బలి అయ్యే అవకాశాలు లున్నాయి.. మిమ్మల్ని గెలిపించుకున్నది మాజీవితాలను నాశనం చేసుకోవడానికి కాదు.. మా మంచిచెడ్డలు చూస్తారని.. మానవత్తం మరచి ప్రవర్తిస్తున్న మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు.. ప్రకృతి ప్రకోపానికి మీ దుర్నీతి కాలి బూడిద కాక మానదు.. కాగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు కాసుల మైకంలో మునిగి తెలుస్తున్నారు.. ఒక్క జీడిమెట్ల డివిజన్ కాకుండా నగరంలోని పలు డివిజన్లలో కెమికల్ కంపెనీలు వెదజల్లుతున్న వ్యర్ధపదార్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి లక్షల్లో లంచం తీసుకుంటున్నారన్నది ఆంథోలన కలిగించే విషయం.. ఈ అవినీతిని అరికట్టకపోతే భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం నెలకొని ఉందన్నది కాదనలేని వాస్తవం..

హైదరాబాద్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గల ఫార్మా కెమికల్‌ పరిశ్రమల నుండి వెలువడిన వ్యర్థాలతో గత 30 ఏళ్ళుగా పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగినందున ఉద్దేశపూర్వకంగా నిబందనల ఉల్లంఘన పర్యావరణ చట్టాలను పాతర వేసినందున జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఫేజ్‌ 1 నుండి 5లో గల ఫార్మా కెమికల్‌ పరిశ్రమలకు 1000 కోట్ల రూపాయల జరిమానా విధించి పర్యావరణ పరిరక్షణ ప్రజా ప్రయోజనాలు కాపాడగలరని సామాజిక, పర్యావణ వేత్తలు కోరుకుంటున్నారు..

- Advertisement -

జీఓ నెం. 20 అమలు చేసి పరిశ్రమలు తరలించాలని తెలంగాణ హైకోర్టులో కేస్‌ దాఖలు అయ్యింది కేస్‌ నెంబర్‌ 132/2020..
హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నందున గత 40 సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం జనవాసాలు లేని ప్రాంతాలలో ఏర్పాటు అయిన పారిశ్రామిక వాడలు ప్రస్తుతం జనవాసాల మధ్యలోకి వచ్చినందున.. నిత్యం లక్షలాది ప్రజలు వాయు, శబ్ధ, జల కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యానికి గురి అవుతున్నారని.. వెంటనే రెడ్‌ క్యాటగిరి పరిశ్రమలు తరలించి పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేస్‌ నమోదు చేయడం జరిగింది. కేస్‌ నెంబరు 132/2020గా విచారణ కొనసాగుతోంది..

హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో నివాస ప్రాంతాలు పెరగడం వల్ల, జనవాసాల మధ్యలోకి వచ్చిన రెడ్‌ క్యాటగిరి అయిన ఫార్మా కెమికల్‌, స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగించడంతో వాటి నుండి వెలువడే వాయు, శబ్ధ, జల కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. బాధిత కాలనీవాసులు పెద్ద ఎత్తున వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదులు చేయడంతో.. అప్పటి ప్రభుత్వం స్పందించి 2013లో అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల జనవాసాల మధ్యన ఉన్న అన్ని రెడ్‌ కేటగిరి పరిశ్రమల తరలించాలని జీఓ నెంబరు 20, 2013లో జారీ చేసినారు.

జీఓ జారీచేసి 10 సంవత్సరాలు గడిచినా ఒక్క పరిశ్రమ తరలించలేదు :
హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న రెడ్‌ క్యాటగిరి పరిశ్రమలను తరలించాలని జీఓ జారీచేసి పది సంవత్సరాలు గడిచినా కాలుష్యం వెదజల్లే ఏ ఒక్క పరిశ్రమను కూడా అధికారులు తరలించలేదు.. కనీసం అటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా ఎక్కడా సమాచారం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం కారణంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ముందుకు సాగడం లేదు.

పరిశ్రమల తరలింపుకు ఫార్మాసిటి ఏర్పాటు :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని రెడ్‌ క్యాటగిరి పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యంతో.. నగర ప్రజల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున ఫార్మా కెమికల్‌ పరిశ్రమలు తరలించడానికి గాను అవుటర్‌ రింగు రోడ్డు అవతల 19000 ఎకరాలతో ముచ్చెర్ల ఫార్మాసిటి పేరుతో భూములు సేకరించి పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేసింది. కావున ముందుగా తీవ్రంగా కాలుష్య సమస్యలు, దాంతో పాటు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గల పరిశ్రమల నుండి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలను నిబంధనలు ఉల్లంగిస్తూ నాలాల ద్వారా హుస్సేన్‌ సాగర్, మూసీ నదిలోకి తద్వారా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ద్వారా కృష్ణా నదిలోకి చేరి సుమారు 200 కిలో మీటర్ల పరిధిలోని ప్రాంతం కాలుష్యం భారిన పడుతున్నందున ముందుగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫార్మా కెమికల్‌ పరిశ్రమలను వెంటనే తరలించి, తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఫార్మా సిటికి తరలించే విధంగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

పరిశ్రమల తరలింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు భరించి నిధులు విడుదల చేయాలి :
హైదరాబాద్ నగరం అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న జీఓ నెంబరు 20 పరిధిలోకి వచ్చే రెడ్‌ క్యాటగిరి పరిశ్రమలు, ఫార్మా కెమికల్‌ పరిశ్రమలు మొత్తం సుమారు 350 వరకు ఉండే అవకాశం ఉన్నందున వీటిని తరలించడం ద్వారా హైదరాబాద్ గ్రేటర్‌ ప్రజలు శాశ్వతంగా గత 25 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న కాలుష్య సమస్య పూర్తిగా తొలగిపోతుంది. కానీ పరిశ్రమలు తరలించి, తిరిగి ఏర్పాటు చేయాలంటే రిస్క్‌తో పాటు, ఖర్చుతో కూడుకున్నది.. కానీ పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాలు, ప్రజారోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే తప్పని సరిగా పరిశ్రమలను తరలించాలి.. అందుకు అయ్యే ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ. 20 వేల కోట్ల నిధులు మంజూరు చేసి, పరిశ్రమ యాజమాన్యాలకు ఆర్థికంగా సహకారం అందిస్తే తరలించడానికి పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కావున ముందుగా నిధులు మంజూరు చేసి, తరలింపుకు మార్గం సుమగం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి.

రెడ్‌ క్యాటగిరి అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని పరిశ్రమలకు సిఎఫ్‌ఓ రెన్యూవల్‌ నిలపుదల చేసి తరలింపు ప్రక్రియ వేగవంతం చేయండి :
హైదరాబాద్ నగర పరిధిలోని అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ఫార్మా కెమికల్‌ పరిశ్రమలు తలలించాలంటే అందుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావాలంటే కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కన్సెంట్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ను తిరిగి ఉత్పత్తులు కొనసాగించకుండా ఉండడానికి రెన్యువల్‌ చేయకుండా ఉంటే జీఓ నెంబరు 20 పరిధిలోకి వచ్చే పరిశ్రమల యాజమాన్యాలు తప్పనిసరి పరిస్థితులలో పరిశ్రమల తరలింపుకు ప్రయత్నాలు జరుపుతారు. కావున ఇప్పటి నుండి అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న రెడ్‌ క్యాటగిరి పరిశ్రమలకు సిఎఫ్‌ఒ రెన్యువల్‌ చేయకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు.. ముఖ్యంగా సిపిసిబి, టిఎస్‌పిసిబి చర్యలు చేపట్టాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు