Saturday, May 18, 2024

సమాజం లో అందరికన్నా గురువు స్థానం పవిత్ర మైనది, గౌరవింపదగినది( జులై 3 సోమవారం నాడు గురుపౌర్ణమి, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ సందర్భంగా…)

తప్పక చదవండి

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వృత్తులలో పవిత్రమైన , గౌరవప్రదమైన స్థానం గురువుది. గు అంటే అంధకారం రు అంటే నిరోధించడం/ నశింపజేయడం గురువు అంటే అంధకారం/ అజ్ఞానం ను రూపుమాపి విజ్ఞాన వంతులను చేయడం అని అంటారు.గురువు అంటే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. తరతరాల నుండి తల్లిదండ్రులు తర్వాత స్థానంలో గురువును పూజిస్తారు. ప్రతి ఒక్కరూ బాల్యంలో గురువు దగ్గర శిష్యరికం చేసిన వారే.

గురు పూర్ణిమ ప్రాధాన్యత :
ఆది గురువు అయిన శివుడు గురు పూర్ణిమ నాడే సప్త ఋషులకు జ్ఞానాన్ని బోధించడం జరిగిందని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. గురు పూర్ణిమ నాడే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధను చేశాడని దత్త చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆది గురువైన వ్యాస మహర్షి పుట్టిన రోజని చెప్తారు. వ్యాస మహర్షి వేదాలను నాలుగు రకాలుగా విభజించి ప్రజలకు అందించిన రోజని చెప్తారు.మహాభారతాన్ని రచించిన రోజు వ్యాస పూర్ణిమ అని చెప్తారు. మహాభారతం, వేదాలతో పాటు అష్టాదశ పురాణములు, విష్ణు సహస్రనామ స్తోత్రము, భారతీయ సంస్కృతికి సంబంధించిన వాజ్ఞాయన్ని అందించిన రోజని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. వివిధ వృత్తులకు సంబంధించిన డాక్టర్లు,ఇంజనీర్లు, శాస్త్ర సాంకేతిక నిపుణులు, పోలీస్ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి గురువుల ప్రభావం బాల్యం నుంచి ప్రతి ఒక్కరిపై ఉంటుంది. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా రాష్ట్రపతి కావడంతో ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 వ తేదీన జరుపుకుంటున్నాము.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా తమ పదవి కాలం ముగిసిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. పాఠాలు చెప్తూ చెప్తూ మరణించాలని ఉంది అనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అదే విధంగా చనిపోవడం జరిగింది.

- Advertisement -

ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలు ఉపాధ్యాయురాలిగా చేసి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర పతి అయ్యారు. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక్కరికి మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే ఒక్కరికి మాత్రమే శిక్ష పడుతుంది.. ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే కొన్ని తరాల వరకు నష్టం కలుగుతుంది.
ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైన,అందరిచేత గౌరవింపదగినది.. గురువు ను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చుతారు. తల్లి దండ్రులు భౌతికంగా జన్మనిస్తే మానసికంగా జన్మనిచ్చిన వారు ఉపాధ్యాయులు. తల్లిదండ్రులకు తమ పిల్లలు అమ్మాయి కాని, అబ్బాయి కాని ప్రయోజకులు కావాలని, సమాజం లో బాగా సంపాదించాలని,మంచి పేరు తేవాలనే స్వార్థం ఉంటుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నిస్వార్థంగా కృషి చేసే జ్ఞానధాతలు గురువులు.వారు ఎప్పుడూ ఇంకిపోని చెరువులు. మహాకవి కబీర్ నా ముందు దేవుడు, ఉపాధ్యాయుడు ఇద్దరు వస్తే నేను నమస్కారం చేసేది మాత్రం ఉపాధ్యాయునికే అన్నారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థులకు ఉత్తమోత్తములను తయారు చేస్తారు. ప్రతి రంగములో నిపుణులను తయారు చేసేది ఉపాధ్యాయులు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు ఉపాధ్యాయ వృత్తిని ప్రతిఒక్కరూ గౌరవిస్తారు. ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులను కాంట్రాక్టు ఉపాధ్యాయులు, వాలంటీర్లు, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రయివేటు ఉపాధ్యాయులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటూ వేరు వేరు పేర్లతో పిలుస్తూ తక్కువ జీతాలు చెల్లించి ఎక్కువ పని చేపిస్తున్నారు.

విదేశాల్లో ఎక్కువ జీతాలు చెల్లించేది ఉపాధ్యాయలకే :
అనేక దేశాల్లో ఉన్నత న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టు లకు ఏదైనా పనిమీద ఉపాధ్యాయులు వెళ్తే వారికి కుర్చీ వేసి కూర్చుబెట్టి మాట్లడుతారట. ప్రస్తుత కాలంలో దూరవిద్య కోర్సులు అందుబాటులో రావడం, కంప్యూటర్ సాప్ట్ వేర్, హార్డ్ వేర్ అభివృద్ధి కావడం వీడియో పాఠాలు,సి.డిలు మార్కెట్లలలో దొరకడం వలన ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా పరోక్ష పద్ధతిలో ఆన్లైన్ బోధించే విధానం ద్వారా ఉపాధ్యాయుల పాత్ర తగ్గిందని కొంత మంది భ్రమ పడుతున్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్లు ఆన్ లైన్ బోధన ద్వారా విద్యార్థులకు ఏమి అర్ధం కాలేదని తెలుస్తోంది.విడియో పాఠాలైన,సి.డిల ద్వారా విద్య అభ్యసించాలన్నా ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 వ తేదీన మనదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను జాతీయ స్థాయిలో, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్ర స్థాయి లో, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జిల్లా స్థాయిలో,మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మండల స్థాయిలో ఇచ్చి ఉపాధ్యాయులను ప్రభుత్వం, స్వచ్చందసంస్థలు పెద్ద యెత్తున ఘనంగా సన్మానిస్తారు. ఉపాధ్యాయులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడుతూ పూలతో, శాలువాలతో, మెమెంటో లతో, నగదు బహుమతులతో సన్మానిస్తారు..

ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు జరిగేనా?
ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు లేక ఐదు సంవత్సరాలు, పదోన్నతులు లేక ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. సోమవారం జులై 3 న తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన కోర్టు కేసు బెంచ్ పైకి వస్తుంది. గురుపూర్ణిమ రోజైన గురువు లకు సంబంధించిన కోర్టు కేసు పరిష్కారం లభిస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.భాష పండితులకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.

గురు పూర్ణిమ,వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ కు దేవాలయము లన్ని సిద్దం ( ముస్తాబు)
గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ నాడు దక్షిణభారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదిశక్తి పేరిట వ్రతాన్ని జరిపించడం,హోమాలను చేయడం, సత్యనారాయణ స్వామి వ్రతము ను చేసి ఉపవాసం ఉండడం చేస్తారు.వీర బ్రహ్మేంద్ర స్వామి ని,ఆది శంకరాచార్య, దత్తాత్రేయుడు, సాయిబాబాను, గౌతమి బుద్దుడు,వేద వ్యాసుడిని పూజిస్తారు.దక్షిణ భారత దేశంలోని గుడులు గురు పూర్ణిమ సందర్భంగా దేవాలయము లన్ని సిద్దం ( ముస్తాబు) చేశారు.పూవులు, కొబ్బరి మట్టాలు కట్టి , చిన్న చిన్న లైట్లతో చక్కగా అలంకరించారు.

  • డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.. 9290826988
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు