- లోక్సభ ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయం..
- భారత్ అంతా నా ఇల్లే అన్న రాహుల్..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో ఆయనకు ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించారు. గతంలో లోక్సభ స్పీకర్ నిర్ణయంతో రాహుల్ వెంటనే ఇంటిని ఖాళీ చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో లోక్సభ సభ్యత్వం పునరుద్దరించడంతో పాటు, బంగ్లాను కూడా కేటాయించారు. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో ఎంపీగా రాహుల్పై అనర్హత వేటు పడింది.. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. సుప్రీంకోర్టులో పరువు నష్టం కేసు నుంచి రాహుల్కు ఊరట లభించడంతో ఆయనకు ఎంపీ హోదాను లోక్సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. దీంతో రాహుల్కు తిరిగి 12 తుగ్లక్ లేన్ బంగ్లాను అధికారులు కేటాయించారు. తన అధికారిక నివాసం తిరిగి తనకు కేటాయించడంపై స్పందించాలని రాహుల్ను కోరగా భారత్ అంతా తన ఇల్లేనని వ్యాఖ్యానించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీకి తొలిసారిగా ఈ బంగ్లాను కేటాయించారు. ఇక సూరత్ కోర్టు తీర్పు నేపధ్యంలో 12 తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో లోక్సభ హౌసింగ్ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.