- జూలై 21నుండి ఆగస్టు 21వరకు ఇంటింటి ఓటర్ల జాబితా
- బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలు ఇవ్వండి….
- పటిష్ట ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం….
- జనవరి 5 వ తేది 2024న తుది ఓటర్ల జాబితా ప్రచురణ…
- నగర ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి…
- జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు
విజయవాడ :ఇంటింటి పరిశీలన ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలకు తావు లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు కోరారు.స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఇంటింటి సర్వే పై డిఆర్ఓ కె.మోహన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ ఇంటింటి పరిశీలన, స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఎటువంటి లోపాలకు తావు లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నామన్నారు. 2019 సాధారణ ఎన్నికలలో రూరల్లోని జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ నియోజవర్గాలలో సగటున 85 నుండి 89 శాతం పోలింగ్ నమోదు అయిందని అయితే నగరంలోని విజయవాడ తూర్పు సెంట్రల్ పశ్చిమ నియోజవర్గాలలో సగటున 65 నుండి 67 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. జిల్లాలో 23 లక్షల 46 వేల 711 మంది జనాభా ఉన్నారని వీరిటో ఇప్పటివరకు 16 లక్షలు ఓటర్లగా నమోదై ఉన్నారన్నారు. ఎలక్ట్రోరల్ పాపులేషన్ రేషియో ప్రకారం మరో 20 నుండి 50 వేల వరకు ఓటర్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024ను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈఆర్వో, ఎఈఆర్వో, బూత్ లెవెల్ అధికారులకు ఇప్పటికే డోర్ టు డోర్ వెరిఫికేషన్ పై శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. జూలై 21 నుండి ఆగస్టు 21, వరకు బూత్ లెవెల్ అధికారులు బిఎల్వో యాప్ ద్వారా ఇంటింటి ఓటర్ల పరిశీలన చేయడం జరుగుతుందని, పరిశీలనలో జాబితాకు సంబంధించిన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడం జరుగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి ఓటర్ల పరిశీలనలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి అపోహాలకు తావు లేకుండా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను త్వరితగతిన సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలలో గుర్తించిన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన వివరాలను నమోదు చేసి అక్టోబర్ 17, 2023న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. ప్రచురించిన జాబితాకు సంబంధించిన దరఖాస్తులు మరియు అభ్యంతరాలను అక్టోబర్ 17, 2023 నుండి నవంబర్ 30, 2023 వరకు స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తులు మరియు అభ్యంతరాల స్వీకరణకు అక్టోబరు 28, 29 మరియు నవంబరు 18, 19 తేదీల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబంధించిన పరిష్కారాలను డిసెంబర్ 26 నాటికి పూర్తి చేసి జనవరి 5, 2024 న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.బూత్ స్థాయి అధికారులు ఓట్లను తొలగించడం గాని చేర్చడం గాని ఉంటుందని కొంతమందికి అపోహాలు ఉన్నాయని బూత్ స్థాయి అధికారులకు ఆ విధంగా చేసే అధికారం లేదని ఆ అధికారం కేవలం ఈఆర్ఓ లకు మాత్రమే ఉంటుందని, వాలంటీర్ల భాగస్వామ్యం కూడా ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు కేవలం నోటీసులు సర్వ్ చేయడానికి, క్షేత్రస్థాయిలో విచారించి తగిన నివేదికలు ఇవ్వడానికే మాత్రమే ఉపయోగిస్తామన్నారు. ఓటర్లను తొలగించే అంశంలో కూడా రెండు శాతం కంటే ఎక్కువ చేస్తే ప్రతి ఓటర్ తొలగింపుకు ప్రధాన ఎన్నికల అధికారి వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ప్రతి మంగళవారం నియోజకవర్గ స్థాయిలో ఈఆర్ఓ, ఎఈఆర్ఓ స్థాయిలోను, ప్రతి బుధవారము జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు స్థాయిలోను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఇంటింటి పరిశీలన కార్యక్రమంలో ప్రస్తుతము ఉన్న ఓటర్ల జాబితాలో ఎమైనా ఇంటి నెంబర్లు ఓటర్ల వయసు పుట్టినతేదీలు ఒకే డోర్ నెంబర్, నందు ఎక్కువ మొత్తములో ఓటర్లు ఉండటాన్ని గుర్తించి వాటిని సంబంధిత బి.యల్.ఓ, ఏ.ఈ.ఆర్.ఓ, ఈ.ఆర్.ఓ, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావలసిందిగా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. 01.01.2024 నాటికి 18 సంవత్సరముల వయసు ఉన్న యువత అర్హత కలిగి ఓటర్లుగా నమోదు కాకుంటే వారి నుండి సంబంధిత పత్రాలు తీసుకొని జనవరి 5వ తేదీన ప్రచురించనున్న తుది జాబితాలో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. ఒకే డోర్ నెంబర్లో అధిక సంఖ్యలో ఓట్లు నమోదు అయిన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరిస్తామన్నారు. తప్పులు లేని తుది ఓటర్ల జాబితా రూపొందించడంలో బిఎల్వోలతో, బిఎల్ఏలు సహకారం పైనే ఆధారపడి ఉంటుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. అనంతరం హాజరైన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు డోర్ టు డోర్ వెరిఫికేషన్ పై సమస్యలు సందేహాలు సూచనలను కలెక్టర్ డిల్లీరావు కోరారు. ఓటర్లు అందుబాటులో ఉండే విధంగా బిఎల్వోలు పరిశీలన చేసే సమయాలను ముందుగా తెలియజేయాలన్నారు. ఒకే డోర్ నెంబర్లో ఉన్న ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు వేసేలా చూడాలని, అపార్టమెంట్లలో నివాసం ఉటుంన్న ఓటర్లకు అపార్టమెంట్ పేరు, బ్లాక్ నెంబర్, ఫ్లోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్లు ఉండేలా చూడాలన్నారు. నగర పాలక సంస్థ డోర్ నెబర్కు కేటాయించిన డిజిటల్ నెంబర్తో గుర్తించడం ఇబ్బందిగా ఉందన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలకు సంబంధించి హెచ్ఐజి, యంఐజి బ్లాక్లకు సంబందించి ఫిక్సిడ్ డోర్ నెంబర్లు ఉండేలా చూడాలని పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. సమావేశంలో డిఆర్ఓ కె. మోహన్కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఎలక్షన్ సెల్ సూపరిడెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఏసుదాస్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎల్ శివరామ ప్రసాద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వై ఆంజనేయరెడ్డి, సిపియం పార్టీ ప్రతినిధి కె. కళ్యాణ్, బి.ఎస్.పి పార్టీ ప్రతినిధి డి. శామ్యూల్ కుమార్, బిజెపి పార్టీ ప్రతినిధి పి.వి. శ్రీహరి ఉన్నారు.
తప్పక చదవండి
-Advertisement-