Sunday, May 5, 2024

పొడుస్తున్న పొద్దు అస్తమయం..

తప్పక చదవండి
  • మూగబోయిన విప్లవ గీతం..
  • ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి..
  • అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస..
  • తెలంగణా ఉద్యమానికి ఊపిరి పోసిన పాట..
  • గద్దర్ గా ప్రఖ్యాతి గాంచిన గుమ్మడి విఠల్ రావు..
  • కనీసం మరో పదేళ్లు బ్రతుకుతారనుకున్నాం: కుటుంబసభ్యులు..
  • ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. రాహుల్,
    కేసీఆర్, చంద్రబాబు, జగన్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు..

ఆ పాట వినగానే.. మనకి తెలియకుండానే ఒళ్ళు పులకించి పోతుంది.. రక్తం మరుగుతుంది.. పోరాటమని పదానికి సైతం ప్రాణాలు లేచివస్తుంది.. విప్లవం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది.. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. అణగారిన వర్గాల్లో ఆశ చిగురిస్తుంది.. వాస్తవ పరిస్థితులను రాగయుక్తంగా సాగుతూ గుండె అట్టడుకు పొరలను తట్టి లేపుతుంది.. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తాయి.. ఆ పాట నేడు అనంతలోకాలకు సాగిపోయింది.. ఓ విప్లవ గొంతుక మూగబోయింది.. యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.. ఇక ఆ గొంతు వినలేము అన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు..

ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ 1949లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్‌ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినిమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయితే అవార్డును ఆయన తిరస్కరించారు. అయినప్పటికి ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు.

- Advertisement -

కాగా, గద్దర్‌ నిజామాబాదు జిల్లా మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో విద్యభ్యాసం పూర్తి చేశారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో ఎంతో చైతన్యం కలిగించేవి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు.

ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్‌లుగా, సిడీలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగం వదులుకొని నాటి నక్సల్స్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరురా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు.

ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్‌కు భార్య విమల, కొడుకు, కూతురు ఉన్నారు.

గద్దర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట పెద్దఎత్తున ప్రజాదరణ పొందింది. “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు కూడా దక్కింది. అయితే ఆయన ఆ అవార్డ్‌ను తిరస్కరించారు. జై బోలో తెలంగాణా సినిమాలో తెరపై కూడా ఆయన కనిపించారు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం విశేషం. ఆయన పట్ల ప్రలువురు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు