- మునుపెన్నడూ లేని విధంగా స్టూడెంట్ పాస్..
- ఒక్క పాస్ కాదు మరెన్నో ప్రయోజనాలు కూడా..
- కొన్ని షరతులు విధించిన మెట్రో యాజమాన్యం..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల కోసం మరో గుడ్న్యూస్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు మహిళలు, వృద్ధులు, రోజూ ప్రయాణించే కస్టమర్లకు ఆఫర్లు ఇచ్చిన మెట్రో.. మొట్టమొదటి సారిగా స్టూడెంట్స్ కోసం అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది. అయితే మెట్రో రైలులో ప్రయాణించే విద్యార్థుల సౌకర్యార్థం.. స్టూడెంట్ పాస్ ఆఫర్- 2023ను పరిచయం చేసింది యాజమాన్యం. ఈ ఆఫర్ను ఆమీర్పేట మెట్రో స్టేషన్లో.. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఎల్ అండ్ టీ ఎంఆర్ఎచ్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. స్టూడెంట్ పాస్ ఆఫర్ కింద.. విద్యార్థులు కేవలం 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి.. 30 ట్రిప్పుల ప్రయాణం చేయవచ్చు.. అయితే దీనికోసం తప్పనిసరిగా కొత్తగా బ్రాండ్ చేయబడిన స్మార్ట్ కార్డులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది..
ఈ ఆఫర్ 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు అంటే తొమ్మిది నెలల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ పాస్.. తీసుకున్న తేదీ నుంచి 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేస్తారు. అయితే అన్నింటికీ మించి ఈ ఆఫర్.. 1 ఏప్రిల్ 1998 తర్వాత జన్మించిన విద్యార్థులే పాస్ పొందేందుకు అర్హులని యాజమాన్యం కండీషన్ పెట్టింది. అంతేకాదు.. ఈ ఆఫర్ పరిమిత కాలమే అందుబాటులో ఉంటుందని.. సంస్థ నిర్ణయం ప్రకారం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చని చెప్తోంది. ఈ పాస్ను విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్లైన్లో.. జెఎన్టీయూ కళాశాల, ఎస్సార్ నగర్, అమీర్పేట, విక్టోరియా మెమోరియల్, దిల్సుఖ్నగర్, గ్రీన్ లైన్లో.. నారాయణగూడ, బ్లూ లైన్లో నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయదుర్గ్ వద్ద కొనుగోలు చేయవచ్చు. పాస్ను విజయవంతంగా కొనుగోలు చేస్తే.. విద్యార్థులు 24 సెవెన్ కన్వీనియన్స్ స్టోర్లు, రిలయన్స్ ట్రెండ్ మొదలైన హైదరాబాద్ మెట్రో రైల్తో అనుబంధించబడిన వివిధ రిటైల్ బ్రాండ్ల డిస్కౌంట్ కూపన్లను కూడా పొందుతారు. పాస్ను ఆన్లైన్లో పొందటం కోసం లేదా నిబంధనలు, షరతులు తెలుసుకునేందుకు www.ltmetro.com వెబ్సైట్కు లాగిన్ అవ్వాలని యాజమాన్యం సూచించింది.