శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ పశ్చిమ మాడవీధిలో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో మూడు వాహనాలు పంచ మఠాల సందర్శనకు, మరో రెండు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్షేత్ర పరిధిలోని పలు ముఖ్య ప్రాంతాలకు నడపనున్నారు. భక్తులు ఈ వాహనాల ద్వారా పంచ మఠాలైన ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం, మహిషాసురమర్దిని ఆలయం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, దేవస్థానం గోశాల, బయలు వీరభద్రస్వామి ఆలయం, అంకాళమ్మ ఆలయాలను సందర్శించొచ్చు.
మిగతా రెండు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి సీఆర్వో ఆఫీసు, గంగా గౌరీ సదన్, మల్లికార్జున సదన్, క్యూ కాంప్లెక్స్ వరకు వృద్ధులు, దివ్యాంగులకు అందుబాటులో ఉంటాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, ప్రధాన అర్చకులు హెచ్ వీరయ్యస్వామి, పీ మార్కండేయ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామకృష్ణ, ఎం నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణ అధికారి ఎం హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ చంద్రశేఖర శాస్త్రి, అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రణయ్, సంబంధిత గుమాస్తా పి దిలీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.