- గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లిదండ్రులు..
- నిన్న నాలాలో గల్లంతైన ఓ మహిళ..
- బాచుపల్లి, సాయినగర్ లో విషాదకర ఘటన..
- రాజీవ్ స్వగృహ వద్ద లభ్యమైన బాలుని మృతదేహం..
హైదరాబాద్: హైదరాబాద్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా.. నిన్న ఓ మహిళ నాలాలో గల్లంతు కాగా.. ఈరోజు ఓ నాలుగేళ్ల చిన్నారి నాలాలో పడి మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కల్వర్టు వద్ద వరద నీటిలో నితిన్ అనే నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. సాయి నగర్ చెరువులోకి కొట్టుకెళ్లినట్టుగా స్థానికుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే నితిన్ నాలాలో పడి కొట్టుకుపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రగతి నగర్లోని సాయినగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలా పక్కనే మిథున్ అనే బాలుడు సరదాగా ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు.. ఆ పిల్లడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితంగా లేకుండా పోయింది. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు… హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. పోలీసులు కూడా బాలుడిని కాపాడలేకపోయారు. చివరికి.. రాజీవ్ స్వగృహ వద్ద బాలుని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు నాలాలో నుంచి వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారి.. క్షణాల్లోనే నాలాలో పడి విగత జీవిగా దొరకటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.