Friday, May 3, 2024

తుంగలో తుంగకుంట చెరువు..?

తప్పక చదవండి
  • మండలం నుంచి కలెక్టర్, సీఎస్ వరకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.?
  • అనారోగ్యాల బారిన పడుతున్న రైతన్నలు, గ్రామస్థులు..?
  • చెరువు, నక్ష బాటలు, బఫర్ జోన్ సైతం దర్జాగా దూరాక్రమణ..
  • మిగిలింది 5 ఏకరాలే.? 9 ఎకరాల చెరువు ఆయాకట్ట భూమెక్కడ..?
  • కోర్టును ఆశ్రయించిన సుమారు 60మంది రైతులు..

రైతులు వ్యవసాయం చేసుకునేందుకు నీటి కొరత లేకుండా భూగర్భజలాలు కాపాడుకునేందుకు అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చెరువు, కుంటలను కొందరు రికార్డుల పరంగా అక్రమిస్తుంటే.. మరి కొందరు తమకున్న పేరు, పలుకుబడితో దర్జాగానే ఖాబ్జా చేయడమే కాకుండా, చెరువు నీటిని రసాయనాలతో కలుషితం చేస్తున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామ శివారులోని తుంగకుంట చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం 886సర్వే నంబరులో 14-24ఎకరాలు ఉంది. కొన్నేళ్ల నుంచి ఆ చెరువు చుట్టుపక్కల పేరుగాంచిన పెద్ద పెద్ద కెమికల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. చుట్టు పక్కల ఉన్న ప్రజలకు, స్థానికులకు ఉపాధి కల్పిస్తూ, మరో వైపు తుంగకుంట చెరువును ఖబ్జా చేయడం ప్రారంభించారని, ప్రతి రోజూ ఆ పరిశ్రమల్లో నుంచి వచ్చే కాలుష్యం నీళ్ళని చెరువులోకి పెద్దపెద్ద పైపులైన్లు వేసి మళ్లించడంతో చెరువు పూర్తిగా కలుషితంతో నిండిపోయిందని, వేసవి కాలంలో వర్షాలు లేకపోవడంతో నీళ్లన్నీ అడుగండిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో పరిశ్రమలలోని కాలుష్యాన్ని వేసిన బోర్లలోకి వదిలిపెట్టడంతో తుంగకుంట చెరువుతో పాటు చుట్టుపక్కల భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ముగజీవాలు సైతం చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.. ఆయా పరిశ్రమల్లో నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో రైతన్నలతో పాటు, గ్రామ శివారులోని వయస్సు పైబడిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయా కుటుంబాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలుష్యం నీళ్ళతో బట్టలు ఉతకడం, స్నానం చేయడంతో అనేక చర్మ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పరిశ్రమల నుంచి కాలుష్యాన్ని వదులుతున్నారని, ఆ కాలుష్యాన్ని పీల్చడంతో అనారోగ్య సమస్యలతో పాటు మతిమరుపు వస్తుందని తెలిపారు. ప్రధానంగా చెరువు, ఎఫ్టిల్, బఫర్ జోన్ లను కలిపి 14.24 ఎకరాలు ఉండాల్సిన తుంగకుంట చెరువును నాట్కో ఫార్మా ఆక్రమించడంతో పాటు బిటి రోడ్డు వేశారు. ప్రస్తుతం సుమారుగా 5ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేకగూడ నుంచి కోల్ భాయ్ తండా వరకు ఉండాల్సిన నక్ష బాటను సైతం నాట్కో ఫార్మా, పోకర్ణ గ్రైనెట్ పరిశ్రమలు ఆక్రమించి మాయం చేశారని, నాట్కో ఫార్మా నూతనంగా ఏర్పడుతున్న మైక్రో సాఫ్ట్ పరిశ్రమకు చెరువు భూభాగాన్ని అమ్మడంతో వేగంగా నిర్మాణాలు కూడా చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఈ విషయాలపై ఉన్నతాధికారులకు పలుమార్లు పిర్యాదు చేయగా విచారణ జరిపి చెరువు ఆక్రమణ చేసింది నిజమేనని, లిఖితపూర్వకంగా తెలిపినప్పటికి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. గ్రామ స్థాయి అధికారుల నుంచి మొదలుకుని జిల్లా కలెక్టర్, సీఎఫ్ వరకు ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల గురించి, చెరువు కబ్జా, నక్ష బాట ఖబ్జాల గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా చూసీ చూడనట్టు ఉంటూ, తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. భూముల ధరలు కోట్ల రూపాయలకు పడగలెత్తడంతో ఓ పరిశ్రమ యాజమాన్యం చాపకింది నీరులా చెరువును మాయం చేస్తూ.. కోట్ల రూపాయలను గడిస్తున్నారు. ఈ తతంగం అంతా దర్జాగా జరుగుతున్న కూడా సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునుగుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు. అధికారులపై నమ్మకం లేక ఒక 60మంది రైతులు తమకు జరుగుతున్న నష్టంపై హైకోర్టును ఆశ్రయించడంతో.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనట్లు రైతులు పేర్కొన్నారు. కాలుష్యం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సవరణ చేపట్టి రికార్డుల ప్రకారం సర్వే చేపడితే మేకగూడ గ్రామంలోని రైతులకు, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేకూరుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు