Monday, April 29, 2024

మంత్రాలయానికి మరో మణిహారం..

తప్పక చదవండి
  • 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం..
  • ప్రపంచంలోనే అతి పెద్దదైన రాములవారి స్టాచ్యూ..
  • వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన అమిత్‌షా..
  • తుంగభద్ర నదీతీరంలో రామరాజ్య స్థాపన..
  • మంత్రాలయంలో నెలకొననున్న మహాద్భుతం..
  • రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆలయం..
  • మరో రెండేళ్లలో భక్తజనానికి అందుబాటులో..
  • భూమి పూజ చేసిన మంత్రాలయ మఠాధిపతి డా. సుభుదేంద్ర తీర్ధ..
  • జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో మహోన్నత కార్యక్రమం..

రాయలసీమ కక్షలు, కాఠిన్యాలకు నెలవు అన్నది అందరి అభిప్రాయం.. కానీ రాయలసీమలో ఆప్యాయతానురాగాలు.. అద్భుత ప్రదేశాలు కూడా ఇక్కడ దర్శనం ఇస్తాయి.. పేరెన్నికగన్న కట్టడాలు కనువిందు చేస్తాయి.. ముఖ్యంగా కర్నూల్ జిల్లా రాయలసీమలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లా.. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం జిల్లా నలుమూలల్లో గోచరిస్తుంది.. మహేశ్వరుడు కొలువై ఉన్న మహానంది.. మహిమాన్వితమైన రవ్వలకొండ, యాగంటి క్షేత్రం.. శ్రీ నారసింహుడు నడయాడిన అహోబిల క్షేత్రం.. సాక్షాత్తూ భ్రమరాంబికా సమేతుడై పరమ శివుడు కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం.. సరస్వతి దేవి కొలువైన కొలను భారతి.. నందవరం శ్రీ చౌడేశ్వరి ఆలయం.. షిరిడీ సాయిబాబా ఆలయం ఇలా ఎన్నెన్నో.. మరీ ముఖ్యంగా కర్నూలు నుండి 90 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఒడ్డున మంత్రాలయం ఉంది. ఇది మధ్వా సెయింట్ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క జీవజాతికి ప్రాముఖ్యతనిచ్చింది. సత్రాలు, సంస్కృత పాఠశాల ఈ ప్రదేశాలని ఆకర్షిస్తున్నాయి.. రాఘవేంద్ర స్వామి సజీవంగా ప్రవేశించిన రాఘవేంద్ర స్వామి బృందావన్ ఎంతో శక్తివంతమైనది.. ఇప్పుడు మంత్రాలయ క్షేత్రానికి మరో ఆణిముత్యం అలంకారంగా మెరవబోతోంది..

రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి డాక్టర్ సుబుధేంద్ర తీర్థ భూమిపూజ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు కేంద్ర మంత్ర అమిత్‌ షా. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ‘జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌, మంత్రి గుమ్మనూరు జయరాం, భాజపా నేత టీజీ వెంకటేశ్‌, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు. కాగా రెండేళ్లలో ఈ విగ్రహం తయారీని పూర్తి చేసి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు. తుంగభద్ర నది తీరంలో రామరాజ్య స్థాపనకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. మంత్రాలయంలోనే మహా అద్భుతం..

- Advertisement -

ప్రపంచంలో ఎత్తైన శ్రీరాముని పంచలోహ విగ్రహం : రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ఆలయాన్ని రూ.300 కోట్లతో నిర్మించనున్నారు. మంత్రాలయంలో అద్భుతం.. ప్రపంచంలో ఎత్తైన శ్రీరాముని పంచలోహ విగ్రహంగా చరిత్రలో నిలిచిపోనుంది.. కాగా శ్రీరాముడి విగ్రహం ఏర్పాటుతో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా మంత్రాలయం విరాజిల్లుతుందని ఈ సందర్భంగా అమిత్ షా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీరాముని పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది. మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటరు దూరంలో పదెకరాల సువిశాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్‌ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లా మరింత ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లబోతోంది..

మరో అపూర్వ మైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుండటం విశేషం.. మంత్రాలయంలో సమాధి అయిన రాఘవేంద్ర స్వామి శ్రీరాముని ఆరాధ్యదైవంగా భావించేవారు… ఆయన మఠానికి సుమారు కిలోమీటరు దూరంలో ఇప్పుడు రాముడి భారీ విగ్రహం ఏర్పాటు కాబోతుండటం నిజంగా ఒక అద్భుతమే.. పైగా దేవాలయాల నిర్మాణంలో సిద్దహస్తుడైన డాక్టర్ వేలు ఈ ఆలయ నిర్మాణం చేపట్టనుండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.. ఈ కార్యక్రమానికి మాజీ ఎం పీ టీ. జీ. వెంకటేష్ తో సహా పలువురు హాజరు అయ్యారు… ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ తుంగభద్ర తీరం భారీ రాముడు కొలువు తీరటం సంతోషకరమన్నారు… విశ్వానికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని చెప్పారు… శ్రీరామ రాజ్యం ఎంత గొప్పగా ఉండేదో నేటికీ చెప్పుకునే సంప్రదాయం కొనసాగుతోందన్నారు… రామరాజ్యం అంటూ నేటికీ శ్రీరాముని గొప్పతనం చెప్పుకోవటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు… తిరుమలలోని శ్రీవారి ఆలయం, కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం,కాశీ విశ్వనాధ్ ఆలయం, భద్రినాధ్ ఆలయం ఇలా చెప్పు కుంటూ అనేక ప్రముఖ దేవాలయాలు భారత దేశంలో వున్నాయి… మంత్రాలయంలో ఇప్పుడు నిర్మించే రామాలయం కూడా వాటి సరసన నిలబడేలా నిర్వాహకులు ధార్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు