Saturday, July 27, 2024

ముందస్తు లేదు..

తప్పక చదవండి
  • షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి
  • ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్‌
  • కేబినేట్‌ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్‌

అమరావతి

ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ ఊహాగానాలకు తెరదించారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంకో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు జగన్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని మంత్రులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు మనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఇటీవల రాజమండ్రి మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్‌ గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్‌ తేల్చిచెప్పారు. ఇటీవల ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట్లాడారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. ఇకపోతే కేబినేట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్‌ 28న అమలు చేస్తారు. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు వచ్చేలా అమలు చేస్తారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. రాష్ట్రంలోని కొత్త మెడికల్‌ కళాశాలల కు 706 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం లభించింది. చిత్తూరు డైరీ ప్లాంట్‌ కు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు అనుమతి ఇచ్చింది. జూన్‌ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. ప్రభుత్వ పెన్షన్‌ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. సీపీఎస్‌ ఉద్యోగుల కోసం సీపీఎస్‌ స్థానంలో ఏపీ జీపీఎస్‌ బిల్లు ప్రవేశ పెడతారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు స్మార్ట్‌ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌ నెట్‌ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌కు కెబినెట్‌ అనుమతి ఇచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు