Sunday, May 19, 2024

భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక పీడకల : ప్రధాని మోడీ..

తప్పక చదవండి

  • ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరికీ నివాళులు..
  • ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని..
  • ప్రస్తుతం ఈజిప్తులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ..
  • యూపీ లో బ్లాక్ డే నిర్వహించిన బీజేపీ..

న్యూ ఢిల్లీ, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1975లో విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి కాలమని, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా అప్పట్లో అత్యవసర పరిస్థితి విధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ”ఎమర్జెన్సీని వ్యతిరేకించి మన ప్రజాస్వామ్య విలువల పటిష్టానికి పాటుపడిన సాహసవంతులందరికీ ఘనంగా నివాళర్పిస్తున్నాను. చరిత్రలో ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. మన రాజ్యాంగ విలువలను పూర్తిగా తుంగలోకి తొక్కారు” అని మోదీ ఆదివారంనాడు ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈజిప్టులో మోదీ పర్యటిస్తున్నారు.

- Advertisement -

స్వతంత్ర భారత చరిత్రలో వివాదాస్పదంగా నిలిచిన ఎమర్జెన్సీని 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించారు. 1977 మార్చి 21 వరకూ ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. అంతర్గత కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినట్టు అప్పట్లో ప్రకటించగా, దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రెండేళ్ల ఎమర్జెన్సీ కాలంలో అసమ్మతిని అణిచివేసేందుకు అనేక మంది విపక్ష నేతలను జైళ్లలో పెట్టారు. పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగించారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు.

యూపీలో బీజేపీ బ్లాక్ డే
కాగా, ఎమర్జెన్సీ చీకటి రోజులకు 48 ఏళ్లు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు ‘బ్లాక్ డే’ పాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ‘బ్లాక్ డే’ పాటించింది. ఈ సందర్భంగా ‘మహా జన సంపర్క్’ ప్రచారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గౌతమ్బుథ్ నగర్లో ప్రారంభించగా, ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. కైరానా, మీరట్, ఘజియాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రసంగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు