దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి మరో ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కారు రానున్నది. టయోటా కిర్లోస్కర్ ఇన్నోవా హైక్రాస్ టెక్నాలజీ ఆధారంగా సరికొత్త ఎంవీపీ రూపుదిద్దుకుంటున్నది. ఇంకా కారు పేరు ఖరారు చేయాల్సి ఉన్నది. వచ్చేనెల ఐదో తేదీన ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ ఎంవీపీని మారుతి సుజుకి మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అంతే కాదు మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా కిర్లోస్కర్ అర్బన్ క్రూయిజర్ హై రైడర్ నుంచి కూడా కొన్ని ఫీచర్లు జత కలువనున్నాయి. గ్రిల్లేస్, లైట్స్ (హెడ్లైట్స్, టెయిల్ లైట్స్) తదితర ఫీచర్లను మారుతి సుజుకి స్వల్పంగా రీ డిజైన్ చేయనున్నదని తెలుస్తున్నది.
మారుతి సుజుకి నెక్సా డీలర్ల వద్ద ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన 5-డోర్ జిమ్నీతోపాటు ఇగ్నీస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా సరసన ఈ సరికొత్త ఎంవీపీ కారు జత కలువనున్నది. టయోటా కిర్లోస్కర్ టెక్నాలజీ సాయంతో మూడు వరుసల శక్తిమంతమైన హైబ్రీడ్ మోడల్ కారును మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు రెండు నెలల క్రితం మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. ధర రూపేణా సరికొత్త ఎంవీపీ, అన్ని కార్ల కంటే టాప్లో ఉంటుందన్నారు.
టయోటా కిర్లోస్కర్ మోటార్స్.. గత డిసెంబర్లో భారత్ మార్కెట్లోకి ఇన్నోవా హైక్రాస్ కారు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.18.55 లక్షల నుంచి రూ.29.99 లక్షల మధ్య పలుకుతున్నది. రెండు ఇంజన్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ల వీవీటీఐ పెట్రోల్, ఫిప్త్ జనరేషన్ షివ్ సిస్టమ్ తో కూడిన 2.0 లీటర్ల వీవీటీఐ పెట్రోల్ ఇంజిన్ వర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంవీపీ ఆరు వేరియంట్లు – జీ, జీఎక్స్, వీఎక్స్, వీఎక్స్ (ఓ), జడ్ఎక్స్, జడ్ ఎక్స్ (ఓ) ల్లో లభిస్తుంది. సరఫరా సమస్యలతో గత ఏప్రిల్ నుంచి టాప్ వేరియంట్లు జడ్ఎక్స్, జడ్ఎక్స్ (ఓ) కార్ల బుకింగ్స్ నిలిపేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ బేస్డ్గా రూపుదిద్దుకున్న ఎంవీపీ కార్ల విక్రయాలపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ విశ్వాసం వ్యక్తం చేశారు. మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మధ్య టెక్నాలజీ మార్పిడికి ఒప్పందం ఉంది.