ఒక యవతి కిడ్నాప్ డ్రామా ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరార్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్కీపింగ్ పని చేస్తున్నది. శుక్రవారం పనికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ యువతి కోసం అంతా వెతికారు. అయితే ఆ యువతి తన సోదరుడి వాట్సాప్కు వాయిస్ మెసేజ్ పంపింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని అందులో పేర్కొంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా, విరార్ ప్రాంత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆ యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎక్కడ ఉన్నది అన్నది సాంకేతిక ఆధారాల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ప్రియుడితో కలిసి విమానంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు ఆమె పారిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కొంతమంది పోలీసులు కోల్కతా వెళ్లారు. వారిద్దరి ఆచూకీని గుర్తించే పనిలో ఉన్నారు.