Sunday, May 5, 2024

హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మహా మాయ..( రూ. 100 కోట్ల ఋణం కోసం పెద్ద ఎత్తున మోసం..)

తప్పక చదవండి
  • బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వాకం..
  • హైదరాబాద్ స్టాక్ ఎక్చేంజి సోమాజిగూడ బిల్డింగ్ ని BIPPL వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్
  • బిల్డింగ్ షేర్ హోల్డర్స్ ప్రమేయం లేకుండా ఎస్.బీ.ఐ.కి మార్టిగేజ్ చేసిన బూర్గు రవికుమార్, కె. శివకుమార్ లు..
  • మార్టిగేజ్ చేయాలంటే కనీసం 76 శాతం షేర్ హోల్డర్స్ స్పెషల్ రెజుల్యేషన్ పాస్ చెయ్యాలి..
  • ఎలాంటి సరైన డాక్యుమెంట్స్ లేకుండానే రూ. 100 కోట్లు లోన్ శాంక్షన్ చేసిన బ్యాంక్ అధికారులు..?
  • ఎస్.బీ.ఐ. కమర్షియల్ బ్యాంక్ కోటి వారికి, డీజీఎం విజిలెన్స్ ఎస్.బీ.ఐ., హైదరాబాద్ వారికి,
    ఆర్.బీ.ఐ., అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేసిన హెచ్.ఎస్.ఈ. షేర్ హోల్డర్స్..

కాదేదీ మోసం చేయడానికి అనర్హం అన్నట్టుగా.. ఎలాంటి ఒప్పొందాలు, అనుమతులు, అంగీకారాలు లేకుండానే తమకు అనుకూలంగా ఉన్న అత్యంత విలువైన స్థలాలను బ్యాంకులకు మార్టిగేజ్ చేస్తూ.. కోట్ల రూపాయల రుణాన్ని అప్పనంగా పొందుతున్న సంఘటనలు నగరంలో రోజుకోచోట బయటపడుతూనే ఉన్నాయి.. అలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగు చూసింది.. నగరంలోని సోమాజీగూడాలో నెలకొని ఉన్న హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలియని వారు లేరు.. అత్యంత ప్రైమ్ లొకేషన్ లో అలరారుతూ నెలకొని ఉంది.. అయితే ఇక్కడ ఒక భాగోతం బయటపడింది.. హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, బిల్డర్ బూర్గు రవికుమార్, హెచ్.ఎస్.ఈ. చైర్మన్, డైరెక్టర్ కె. శివకుమార్ తో కలిసి హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ కు సంబంధించిన ఖరీదైన స్థలాన్ని షేర్ హోల్డర్స్ స్పెషల్ రెజుల్యేషన్ లేకుండానే దొడ్డిదారిన కోఠి లోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, కమర్షియల్ బ్రాంచ్ కి మార్టిగేజ్ చేసి రూ. వంద కోట్ల ఋణం తీసుకున్నారు.. ఎంతో ప్రాముఖ్యత కల్గిన హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ విషయంలోనే ఇలాంటి ఘరానా మోసం జరుగుతుంటే.. ఇక నగరంలోని మిగతా చోట్ల ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయో..? ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగక మానదు..

హైదరాబాద్ నగరం నడిబొడ్డులో, సోమాజీగూడ ప్రాంతంలో హైదరాబాద్ స్టాక్ ఎక్చేంజ్ బిల్డింగ్ అందరికీ సుపరిచితమే.. ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయడం జరిగింది.. కాగా బిల్డింగ్ డెవలప్మెంట్ చేయడానికి ఖజానా లేక, చేసిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి న్యాయం చేయలేక సతమతమైన బూర్గు ఇన్ఫ్రా ఎండీ, బిల్డర్ బూర్గు రవికుమార్, హెచ్.ఎస్.సి. కంపెనీ డైరెక్టర్, చైర్మన్ కె. శివకుమార్ లు కలిసి ఒక పథకం వేశారు.. తాము డెవలప్మెంట్ కోసం హెచ్.ఎస్.ఈ. కంపెనీ షేర్ హోల్డర్స్ నుంచి తీసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ కు సంబంధించిన 17052 గజాల స్థలాన్ని షేర్ హోల్డర్స్ స్పెషల్ రెజ్యులేషన్ పాస్ చేయకుండానే హైదరాబాద్ లోని కోటి ఎస్.బీ.ఐ. కమర్షియల్ బ్రాంచ్ కు 100 కోట్ల రూపాయల ఋణం కోరుతూ అత్యంత ఖరీదైన ఆ స్థలాన్ని మార్టిగేజ్ చేయడం జరిగిందని షేర్ హోల్డర్స్ ఆరోపిస్తున్నారు.. వాస్తవానికి షేర్ హోల్డర్స్ లో దాదాపు 76 శాతం మంది స్పెషల్ రెజ్యులేషన్ పాస్ చేస్తేనే బ్యాంకు వారు మార్టిగేజ్ చేసుకోవడానికి వీలుంటుంది.. కానీ ఇవేమీ లేకుండా షేర్ హోల్డర్స్ కి తెలియకుండా బూర్గు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, బిల్డర్ బూర్గు రవికుమార్, హెచ్.ఎస్.ఈ. డైరెక్టర్, చైర్మన్ కె. శివకుమార్ లు కలిసి అడ్డగోలుగా బ్యాంకు వారికి ఆ స్థలాన్ని మార్టిగేజ్ చేయడం జరిగింది.. మరి సరైన అనుమతి పత్రాలు లేకుండా బ్యాంకు అధికారులు ఆ స్థలాన్ని ఏవిధంగా మార్టిగేజ్ చేసుకున్నారో అర్ధంకాని పరిస్థితి.. దీన్నిబట్టి బ్యాంకు అధికారులు సదరు బూర్గు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, బిల్డర్ బూర్గు రవికుమార్, హెచ్.ఎస్.ఈ., డైరెక్టర్, చైర్మన్ కె. శివకుమార్ లతో ములాఖత్ అయ్యారన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్ధం అవుతోంది.. చట్ట విరుద్ధంగా భూమిని బ్యాంకు వారికి మార్టిగేజ్ చేసిన బూర్గు ఇన్ఫ్రా ఎండీ, బిల్డర్ బూర్గు రవి కుమార్, హెచ్.ఎస్.ఈ. చైర్మన్ శివకుమార్ లపై బిల్డింగ్ షేర్ హోల్డర్లు 20 డిసెంబర్, 2022 నాడు.. ఎస్.బీ.ఐ. కమర్షియల్ బ్యాంకు, కోఠి వారికి డీజీఎం విజిలెన్స్ ఎస్.బీ.ఐ., హైదరాబాద్ వారికి, ఆర్.బీ.ఐ., అంబుడ్స్ మన్, ఆర్.ఓ.సి. వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.. కాగా హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ వారికి 8-5-2023 నాడు ఆర్.ఓ.సి. అధికారులు నోటీసు జారీ చేశారు.. (S.R.N.J. / 00081106/20-01-2023).. దీనికి ఎస్.బీ.ఐ. బ్యాంకు అధికారులు సమాధానం ఇస్తూ.. 14-03-2023 నాడు సంబంధిత ఆ స్థలానికి ఎన్.ఓ.సి. జారీ చేసినట్లు 20-02-2021 నాడు బ్యాంకు వారు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.. మార్టిగేజ్ చేయలేదని చెబుతూనే, ఎన్.ఓ.సి. ఇవ్వడం చట్టాన్ని మోసం చేయడమే అవుతుందని షేర్ హోల్డర్స్ ఆరోపిస్తున్నారు.. నిజానికి అవసరమైన లోన్ బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే హెచ్.ఎస్.ఈ. షేర్ హోల్డర్స్ నుంచి కంపెనీ యాక్ట్ 2013 అండర్ సెక్షన్ యూ.సి 180 (1) ప్రకారం దాదాపు 76 శాతం మంది స్పెషల్ రెజ్యులేషన్ పాస్ చేయాలని చట్టాలు చెబుతున్నా వాటిని తోసిపుచ్చుతూ బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, బిల్డర్ బూర్గు రవికుమార్, హెచ్.ఎస్.ఈ. చైర్మన్ కె. శివకుమార్ లు మోసపూరితంగా విలువైన స్థలాన్ని బ్యాంకు వారికి మార్టిగేజ్ చేయడం అనాథరైజ్డ్ గ్రాస్ వాయులేషన్ అవుతుంది.. ఇదే విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ షేర్ హోల్డర్స్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.. అయితే సదరు స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదంటూ చెబుతూనే, ఆ స్థలానికి ఎన్.ఓ.సి. జారీ చేశామని సమాధానం ఇచ్చిన ఎస్.బీ.ఐ. బ్యాంకు అధికారులు తప్పు చేశారు కనుక శిక్షార్హులు అంటున్నారు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ హోల్డర్స్.. మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే సదరు స్థలాన్ని ఎస్.బీ.ఐ. బ్యాంకు వారు మార్టిగేజ్ చేసుకున్నారని స్పష్టంగా ఇప్పటికీ మినిస్ట్రీస్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ వెబ్ సైట్ లో చూపిస్తోంది.. మరి దీనికి బ్యాంకు అధికారులు ఏమని సమాధానం చెబుతారు..? ఈ వెబ్ సైట్ లో 19-2-2021 నాడే బూర్గు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది.. ఇక్కడ తప్పుచేసింది ఎవరు..? షేర్ హోల్డర్స్ అనుమతులు లేకుండా విలువైన స్థలాన్ని మార్టిగేజ్ చేసిన బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, బిల్డర్ బూర్గు రవికుమార్, హెచ్.ఎస్.ఈ. డైరెక్టర్, చైర్మన్ శివకుమార్ లదా..? ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మార్టిగేజ్ చేసుకుని రూ. 100 కోట్ల ఋణం శాంక్షన్ చేసి, ఆ తరువాత మాట మార్చిన ఎస్.బీ.ఐ. అధికారులదా..? అమాయకులైన స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ షేర్ హోల్డర్స్ దా..? కాగా N.C.L.A.T. చెన్నై లో ఈ వ్యవహారాలకు సంబంధించిన కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉండటం గమనార్హం..( కేసు ఫైల్ నెంబర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. TA48/2021 (CA(AT) 192/2019.. IA-NO: 986/2022.. IA-NO : 987/2022.. IA-1014/2020 )..

- Advertisement -

వ్యవస్థలోని లోపాలను ఆధారంగా చేసుకుని.. ఏకంగా చట్టాలను సైతం పక్కన బెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక నేరాలు అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో..? అన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరకని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి అంటే అతిశయోక్తి కాదు.. హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ స్థలం మార్టిగేజ్ వ్యవహారంలో మరిన్ని ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు