సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో చెలరేగుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు ఏదో రూపంలో అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. బాధితుల కష్టార్జితాన్ని క్షణాల్లోనే లూటీ చేస్తున్నారు. తాజాగా ఓ స్కామర్ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసి పేమెంట్ చేసినట్టు నకిలీ స్క్రీన్షాట్ను చూపడంతో జ్యూవెలర్ ఏకంగా రూ. 2 లక్షలు పోగొట్టుకున్నారు. గురుగ్రాంలోని ఓ జ్యూవెలరీ స్టోర్లోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి రూ. 2 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. గోల్డ్ కాయిన్స్ కొనుగోలు అవసరమైన డబ్బు ఆన్లైన్లో చెల్లిస్తానని స్టోర్ యజమానికి నమ్మబలికాడు. స్టోర్ యజమాని తన భర్త బ్యాంక్ వివరాలు అందించగా పేమెంట్ పూర్తిచేశానని నిందితుడు ఓ స్క్రీన్షాట్ను చూపాడు. అతడిని నమ్మిన స్టోర్ యజమాని ఆన్లైన్ పేమెంట్ పూర్తయిందునుకుని స్కామర్ను స్టోర్ విడిచివెళ్లేందుకు అనుమతించింది.
ఆపై జూవెలరీ స్టోర్ యజమాని ఖాతాలో ఎలాంటి డబ్బు జమ కాకపోవడంతో మోసపోయామని గుర్తించిన యజమాని అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ముఖేష్ కుమార్ ఆస్పత్రిలో ఉండగా ఆయన బ్యాంకు ఖాతా వివరాలను నిందితుడికి పంపానని, అతడు చెల్లింపు పూర్తయిందని తన వాట్సాప్నకు స్క్రీన్షాట్ పంపాడని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకుంటే తమ ఖాతాలో నగదు డిపాజిట్ కాలేదని గుర్తించామని తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.