ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉంటారు. మహీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో కూల్గా కనిపించే మహీ.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. ఇక, ఐపీఎల్లో కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. చెన్నై టీమ్కు నాయకత్వం వహించిన మిస్టర్ కూల్.. మొత్తం ఐదు సార్లు ట్రోఫీ అందించాడు. కాగా, తాజాగా ధోనీ నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘చాలామందిలాగే మహేంద్ర సింగ్ ధోనీ ఇంకో ఏడాది ఐపీఎల్లో ఆడితే చూడాలనుకునేవారిలో నేనూ ఒకడిని. అయితే, ఎక్కువ కాలం అలా జరగాలని నేను ఆశించను. ఎందుకంటే భవిష్యత్తులో ధోనీ రాజకీయాల గురించి కూడా ఆలోచిస్తాడని నేను నమ్ముతున్నాను. ఎన్సీసీ (NCC) సమీక్ష ప్యానెల్లో మహీతో కలిసి నేను పనిచేశాను. క్రీడా మైదానంలో అతని చురుకుదనాన్ని, మేధస్సుని దగ్గర్నుంచి చూశాను. క్రీడారంగంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఇతర విషయాల్లో కూడా ధోనీ అంతే చురుగ్గా వ్యవహరిస్తాడు. ఇతరులతో సులువుగా కలిసిపోయే మనస్తత్వం అతనిది. వినూత్నంగా ఆలోచిస్తాడు. దృఢంగా కూడా ఉన్నాడు. కచ్చితంగా అతను భవిష్యత్తు నాయకుడు’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది