Thursday, April 25, 2024

పఠాన్ చెరు బాధితులకు అండగా కాంగ్రెస్ లీడర్

తప్పక చదవండి
  • ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో బాధితులను పరామర్శించిన కాట శ్రీనివాస్ గౌడ్..
  • కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యుల హస్తం ఉందంటూ ఆరోపణలు..
  • కరెంటు మీటర్లు, ఇంటి నెంబర్లు ఇచ్చి, టాక్స్ సైతం కట్టించుకొని కూల్చివేతల్లో అంతర్యం ఏమిటి…?
  • ఐలాపుర్ తండాలో ఎమ్మేల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడి 6 ఎకరాల లేఅవుట్..
  • ఎమ్మేల్యే తమ్ముడు మధుసూధన్ రెడ్డి భరోసాతోనే కొనుగోలు చేశామన్న బాధితులు..
  • వందల కోట్ల భూస్కాంలో అధికార పార్టీ నాయకులదే కీలక రోల్..
  • అక్రమార్కులకు అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు..

ఇంత దారుణం జరుగుతున్నా.. 318 కుంటుంబాలు రోడ్డుపాలైతే.. ఏ ఒక్క ఛానల్ గానీ, పత్రికగానీ మాట్లాడకపోవడం దారుణం.. అధికార పార్టీ వాళ్ళే ఈ దారుణానికి ఒడిగట్టారు కాబట్టి, వారు ఎలాగూ స్పందించరు.. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించక పోవడం ఆశ్చర్యం.. మరి ఈ మీడియా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి అమ్ముడు పోయాయా..? లేక స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి ని చూసి భయపడుతున్నారా..? ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘లో వచ్చిన కథనాన్ని చూసి నా మనసు చలించిపోయింది.. అందుకే బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వచ్చాను : కాటా శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : వారి ఆశలు అడియాశలైయ్యాయి.. రాజకీయ పదవులను అడ్డం పెట్టుకుని.. ధనబలంతో పేదలమైన తమ ఉసురు తీసుకున్న నాయకులపైన అమాయకులైన పేదలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. రక్తం ధారబోసి సంపాదించిన డబ్భులతో కొనుక్కున్న స్థలంలో నివాస గృహాలు నిర్మించుకుని, కాయా కష్టం చేసుకుంటూ ఇంటి నీడన జీవితాలు వెళ్లదీస్తున్న తమను రోడ్డుపాలు చేశారంటూ రోదిస్తున్న వారి పరిష్టితి చూసి ఏ నాయకుడూ స్పందించిన పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో తమకు ఎవరు న్యాయం చేస్తారో అని బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక ఆశాజ్యోతిలా కనిపించారు.. వారికి న్యాయం జరిగేవరకూ పోరాడతానని, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.. ఇప్పటికైనా ఆయన పోరాటంతో వారికి న్యాయం జరుగుతుందా..? అన్నది వేచి చూడాలి..

- Advertisement -

సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలా పూర్ తండా గ్రామాల్లో అధికారులు చేపట్టిన కూల్చివేతలు వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి.. కూల్చివేతల తరువాత ఆ ప్రాంతంలో.. కూల్చివేతల వెనుక జరిగిన పలు విషయాలు వెలుగులోకి వచ్చి విస్మయానికి గురిచేస్తున్నాయి.. స్థానిక శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూధన్ రెడ్డి ఆ ప్రాంతంలో 6 ఎకరాల్లో లే అవుట్ చేశారని.. ఆయన భరోసాతోనే లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి, ప్లాట్లు కొని నిర్మాణాలు చేపడితే.. కూల్చివేతలతో తామంతా రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఒక్కొక్క ప్లాట్ ని 10 నుండి 20 లక్షల రూపాయలకు అమ్ముకొని, కూల్చివేతలు అనంతరం అమ్మిన వ్యక్తులు కనపడకుండా పోవడంతో.. దిక్కు తోచని పరిస్థతిలో బిక్కు బిక్కుమంటూ ఎవరైనా తమకు అండగా నిలుస్తారని ఎదురు చూస్తుండటం బాధితుల వంతైంది.. వందల కోట్ల రూపాయల భారీ భూ స్కాంలో అధికార బి.అర్.ఎస్. పార్టీ నాయకులే కీ రోల్ వహించారని తెలుస్తోంది.. అక్రమార్కులు అధికార పార్టీ నాయకులు అవడంతో వివిధ శాఖల అధికారులు అండగా నిలిచి నిర్మాణదారులకు కరెంట్ మీటర్లు, ఇంటి నెంబర్లతో పాటు, ట్యాక్స్ రిసీప్ట్ లు సైతం అందజేశారు.. నాడు కాసులకు కక్కుర్తిపడి బాధితులకు ఏమికాదు అని చెప్పిన అధికారులే వచ్చి కూల్చివేతలు చెపట్టడంతో భాదితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.. విషయం తెలుసుకున్న పఠాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గురువారం సాయంత్రం ఐలా పూర్, ఐలా పూర్ తండా గ్రామాల్లోని బాధితులను పరామర్శించి.. అధైర్యపడొద్దని అండగా ఉంటామని బరోసా ఇచ్చి.. బాధితులను పరామర్శించారు.. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడును ఆయనకు తెలిపారు.. గ్రామాల్లో ఉన్న పొలాలను అమ్ముకొని, చిట్టి డబ్బులు ఎత్తుకొని, దాచుకున్న సొమ్ముతో సొంతిల్లు ఉంటుందని లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశామని బోరున విలపించారు.. నేటి వరకు ఏ ఒక్కరూ కూడా తమ గోడును వినిపించుకోనేందుకు ఇటువైపు రాలేదని, తమని చూసి న్యాయం జరుతుందనే ఆశ ఏర్పడుతుందని పేర్కొన్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార బి.అర్.ఎస్. పార్టీ శాసనసభ్యులు ఆయన కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే వందల కోట్ల భూ స్కాం జరిగిందన్నారు.. పారదర్శకమైన పాలన అందిస్తామని కొత్త పంచాయితీ రాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చిన బి.అర్.ఎస్. పార్టీ ప్రభుత్వమే ఆ చట్టం అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.. అక్రమంగా ఇంటి నిర్మాణాలు జరిపితే ప్రాథమిక దశలో అధికారులు అడ్డుకొని ఉంటే పేదలు ఇంత పెద్ద ఎత్తున నష్ట పోయే పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగితే పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 268 ప్రకారం, ఉన్నతాధికారులు పాలక వర్గాన్ని రద్దుచేస్తూ.. పంచాయితి కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోవడానికి స్థానిక శాసనసభ్యుడే కారణమని ఆరోపించారు.. అధికార పార్టీ నాయకులు చేసే కబ్జాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా.. వారికి నోటీసులు ఇచ్చి కాలయాపన చేసే అధికారులు.. ప్రభుత్వానికి ఇంటిపన్ను చెల్లిస్తున్న పేదలకు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు