- వేగవంతమైన చర్యల్లో నిమగ్నమైన ఎన్నికల సంఘం..
- శనివారం మాస్టర్ ట్రైనర్లకు సంబంధించిన సర్కులర్ విడుదల..
- ఈనెల 5 నుంచి 10 తేదీ వరకు ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం..
- ఓటర్ల నమోదు నుంచి లెక్కింపు వరకు సమగ్ర సూచనలు..
- ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారని అంచనా..
హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నవంబర్ లో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం తన చర్యలను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. నిన్న అధికారుల బదిలీ ప్రక్రియపై సర్క్యులర్ జారీ చేసిన ఈసీ.. ఇవాళ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణకు సంబంధించిన మరో సర్క్యులర్ ను ఇచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి 10 వ తారీఖు వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.
ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశం ఉన్నదని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 మందికి శిక్షణ ఇస్తారు. వీళ్లు కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి..? అందులో ఎన్ని పనిచేస్తున్నాయి. ఇంకా ఎన్ని కావాలి..? అనే అంశాలపైనా ఈసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈసీ చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తున్నది ఈ ఏడాది నవంబర్ లోనే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.