Sunday, May 19, 2024

అంతా నా ఇష్టం..

తప్పక చదవండి
  • నేను పెట్టిందే తినాలి..
  • మోనూ గినూలు నాకు అవసరం లేదు..
  • ఆశ్రమ విద్యార్థులకు స్కిన్‌ చికెన్‌ సరఫరా..
  • కోడిగుడ్డు 45 గ్రాములకు బదులు 30 గ్రాములే..
  • కాంట్రాక్టర్‌దే ఇష్టారాజ్యం.. పట్టించుకోని అధికారులు..
    పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, కొత్తగూడెం నియోజకవర్గంలోని, పాల్వంచలోని గిరిజన ఆశ్రమ, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు, కాంట్రాక్టర్‌. విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన కోడి కూరతో పాటు, కోడిగుడ్లను సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్‌ అవేమీ పట్టించుకోకపోయినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తోలు లేకుండా గిరిజన ఆశ్రమ, గురుకులాల విద్యార్థులకు కోడికూర సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ తోలుతోనే ఉన్న చికెన్‌ను సరఫరా చేస్తున్నా.. ఏ అధికారి కూడా ప్రశ్నించడం లేదు.. అదే విధంగా కోడిగుడ్డు బరువు 45 గ్రాములుగా ఉండాలి.. కాని సదరు కాంట్రాక్టర్‌ 30 నుంచి 40 గ్రాముల బరువు ఉన్న కోడిగుడ్లను సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా నా ఇష్టం.. నేను సరఫరా చేసింది తినాలి. మెనూ గినూలు నాకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కిన్‌లెస్‌ చికెన్‌ 190కు, కోడిగుడ్డు బరువు 45 గ్రాములు ఉండేలా సరఫరా చేసేందుకు టెండర్‌ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్‌.. స్కిన్‌తో ఉన్న చికెన్‌ రూ.130నుంచి రూ.140కు వచ్చే కూరను సరఫరాచేస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్‌ వ్యవహరిస్తున్న తీరుపట్ల విద్యార్థుల తల్లి దండ్రులతో పాటు విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సరఫరా చేస్తున్న చికెన్‌ను గిరిజన సంఘం నాయకులు శివనాయక్‌, నాగేంద్ర నాయక్‌లు ఆదివారం పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ప్రకారం గిరిజన విద్యార్థులకు సదరు కాంట్రాక్టర్‌ చికెన్‌, కోడిగుడ్లను సరఫరా చేయాల్సిన విధానాలను తుంగలో తొక్కి, నిబంధనలకు విరుద్ధంగా స్కిన్‌ చికెన్‌తోపాటు తక్కువ సైజు ఉన్న కోడిగుడ్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం హేయమైన చర్యని అభివర్ణించారు. సదరు కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి, టెండర్‌ రద్దు చేయడంతో పాటు నిబంధనలను తుంగలో తొక్కినకాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
    విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం : ఎటిడబ్ల్యుఓ చంద్రమోహన్‌
    పాల్వంచలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా స్కిన్‌ చికెన్‌తోపాటు 30 నుంచి 40గ్రాముల బరువు ఉన్న గుడ్లను సదరు కాంట్రాక్టర్‌ విద్యార్థులకు సరఫరా చేస్తున్నాడన్న విషయంపై ఎటిడబ్ల్యుఓ చంద్రమోహన్‌ను ఆదాబ్‌ హైదరాబాద్‌ వివరణ కోరింది. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. స్కిన్‌ చికెన్‌తోపాటు తక్కువ బరువు ఉన్న కోడిగుడ్లను సరఫరా చేస్తున్నాడన్న విషయం తన దృష్టికి కూడా వచ్చిందని.. ఈ వ్యవహరంపై విచారణ జరిపించి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు